తాగుబోతు అయ్యన్న, టీడీపీ ప్రతినిధి రామకృష్ణ.. వీళ్లంతా న్యూట్రల్ నేతలా : ఉత్తరాంధ్ర చర్చా వేదికపై గుడివాడ ఫైర్
ఉత్తరాంధ్ర చర్చా వేదిక వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపింది. విశాఖ కేంద్రంగా త్వరలోనే పరిపాలన మొదలు పెడతామని అధికార పక్షం చెబుతున్న సమయంలో చర్చా వేదికపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
ఉత్తరాంధ్ర చర్చా వేదికపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది కోల్డ్ స్టోరేజ్ నేతలు పెట్టిన సమావేశమంటూ మంత్రి సెటైర్లు వేశారు. కొణతాల రామకృష్ణ టీడీపీ ముసుగులో పనిచేస్తున్న వ్యక్తంటూ గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తాగుబోతు అయ్యన్న, టీడీపీ ప్రతినిధి లాంటి రామకృష్ణతో సమావేశం పెడితే చూస్తూ ఊరుకోవాలా అని అమర్నాథ్ ప్రశ్నించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే కోరిక తప్ప ఇక్కడ అభివృద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు.
సభకు వచ్చినవారు న్యూట్రల్ నాయకులు అంటే ఎలా మంత్రి ప్రశ్నించారు. విశాఖలో తాము వేల కోట్ల విలువైన భూములను కాపాడామని అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర చర్చా వేదికలో రాజధాని ప్రస్తావన లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై విమర్శలకే నేతలు పరిమితమయ్యారని అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రుల ఆకాంక్షలపై చర్చా వేదికలో మాట్లాడలేదని.. కోల్ట్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబును సీఎం ఎలా చేయాలన్నదే వీళ్లకు ముఖ్యమని అమర్నాథ్ విమర్శించారు.
అయ్యన్న మంత్రిగా వున్నప్పుడు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి, వైసీపీ గిరిజన ప్రాంతాలను కాపాడిందని గుడివాడ పేర్కొన్నారు. రాజధానిని అడ్డుకునేవారు విశాఖలో అడుగుపెట్టొద్దని ఆయన హెచ్చరించారు.