Asianet News TeluguAsianet News Telugu

సొంత వర్గానికి మేలు చేసే స్కెచ్ .. హైదరాబాద్ మాదిరే అమరావతిలోనూ : చంద్రబాబుపై ధర్మాన ఆరోపణలు

హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు తనవాళ్లకు దక్కేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. రికార్డులను మాయం చేసి పేదలను బెదిరించి భూములు లాక్కొన్నారని ప్రసాదరావు ఆరోపించారు. 

minister dharmana prasada rao slams tdp chief chandrababu naidu in amaravati inner ring road scam ksp
Author
First Published Sep 27, 2023, 3:27 PM IST

హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు తనవాళ్లకు దక్కేలా చంద్రబాబు చేశారని ఆరోపించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. అమరావతిలోని అసైన్డ్ భూముల రికార్డులు మాయం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఫలాలను తన వర్గానికే దక్కేలా చేసిన ఆయన.. అమరావతిలోనూ అదే చేయాలని చూశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ డబ్బుతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌ చేశారని ధర్మాన అన్నారు. రికార్డులను మాయం చేసి పేదలను బెదిరించి భూములు లాక్కొన్నారని ప్రసాదరావు ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం యంత్రాంగాన్ని వాడుకున్నారని.. ఇదే అమరావతిలో 50 వేల మందికి సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. 

అంతకుముందు ఇన్నర్ రింగ్‌ రోడ్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చపై మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. హెరిటేజ్, లింగమనేని ఇల్లు, నారాయణ కాలేజీల కోసం చంద్రబాబు ప్లాన్‌ను మార్చారని ఆరోపించారు. దొంగలు రెక్కీ చేసినట్లుగా ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ చేశారని పేర్ని నాని దుయ్యబట్టారు. హెరిటేజ్ సంస్థకు డైరెక్టర్‌గా వున్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని లోకేష్ నిర్ణయించారని ఆయన పేర్కొన్నారు. 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేష్ వున్నారని పేర్ని నాని తెలిపారు. 

ఏ 14గా వున్న లోకేష్ ఐఆర్ఆర్‌తో నాకేం సంబంధం అంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడి యువతను రెచ్చగొట్టి ఇప్పుడు ఢిల్లీలో తిరుగుతున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. కేసులు ఎక్కువగా వున్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తానన్న లోకేష్ ఇప్పుడు ఎక్కడ అని పేర్ని నాని చురకలంటించారు. రూ.371 కోట్లకు ఇంత రాద్దాంతం దేనికని భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రూ.371 కోట్లు టిప్పే అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారని పేర్ని నాని ప్రశ్నించారు. 

ALso Read: హెరిటేజ్, లింగమనేని, నారాయణల కోసం చంద్రబాబు ‘‘ఇన్నర్’’ ప్లాన్ మార్చారు : పేర్ని నాని

ఇన్నర్ రింగ్ రోడ్‌ను అటు ఇటు తిప్పినందుకు పాల కంపెనీకి  5 ఎకరాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దేశభక్తితోనే నా ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్లు లింగమనేని రమేష్ హైకోర్టులో చెప్పారని నాని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి కథల్లో ఇది కూడా ఒకటని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇది కేబినెట్ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారని.. మాస్టర్ ప్లాన్ పేరుతో స్కామ్ నడిపించారని ఆయన ఫైర్ అయ్యారు. లింగమనేని రమేశ్ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చేలా ప్లాన్ మార్చారని పేర్ని నాని ఆరోపించారు. 

సీఎం పదవి పోయిన వెంటనే లింగమనేని రమేష్‌కు రూ.27 లక్షలు అద్దె చెల్లించారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూములని గవర్నమెంట్ లాక్కుంటుందని భయపెట్టారని నాని తెలిపారు. రూ.27 లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు చెప్పవన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు ఒప్పుకోనివారిని ఏ 2, ఏ 14 బెదిరించారని పేర్ని నాని ఆరోపించారు. రాజధాని ఏర్పాటుపై కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు తుక్కలో తొక్కారని.. ఎకరం భూమిని రెండు నుంచి 5 లక్షలకే రాయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios