బచ్చాగాళ్లు.. నచ్చకుంటే తీసిపారేస్తాం : వాలంటీర్లపై నోరు పారేసుకున్న మంత్రి దాడిశెట్టి రాజా
వాలంటీర్లపై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లు బచ్చాగాళ్లని, నచ్చకపోతే తీసేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలే సెక్రటేరియట్ లను కంట్రోల్ లోకి తీసుకోవాలన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో వుండే వైసీపీ నేత, మంత్రి దాడిశెట్టి రాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన వాలంటీర్, సచివాలయ వ్యవస్థనే రాజా టార్గెట్ చేశారు. వాలంటీర్లు మనం పెట్టిన చిన్న బచ్చాగాళ్లని.. వాళ్లు మనపై పెత్తనం చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్లను మనమే పెట్టామని.. నచ్చకపోతే తీసేయాలంటూ దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు సెక్రటేరియట్లను కంట్రోల్లోకి తీసుకుని నడిపించాలని రాజా అన్నారు.
ఇకపోతే... కొద్దిరోజుల క్రితం మంత్రి అంబటి రాంబాబు సైతం వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులన్నారు. అంతేకాదు..పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతే వాలంటీర్లనే తీసేస్తామని హెచ్చరించారు. అవసరమైతే వారి స్థానంలో కొత్త వారిని తీసుకుంటామని అంబటి స్పష్టం చేశారు. ఇలా రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు వాలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.