కర్నూల్ బేతంచర్లలో ఏపీ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  పర్యటనలో  తేనేటీగల దాడి  చోటు  చేసుకుంది.ఈ ప్రమాదం నుండి మంత్రి  రాజేంద్రనాథ్ రెడ్డి  తప్పించుకున్నారు.

నంద్యాల: ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని బేతంచర్లలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తేనేటీగల దాడి నుండి తృటిలో తప్పించుకున్నారు. మంత్రి పర్యటనలో పాల్గొన్న పలువురు తేనేటీగల దాడిలో గాయపడ్డారు.

బేతంచర్లలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించే సమయంలో తేనేటీగలు దాడి చేశాయి. ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాపాడారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై దాడి చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కండువాలు కప్పి కాపాడారు.

తేనేటీగల దాడిలో సుమారు 70 మందికిపైగా గాయపడ్డారు. తేనేటీగల దాడిలో మంత్రి ఇద్దరు గన్ మెన్లకు కూడ గాయాలయ్యాయి. మంత్రి పర్యటన కవర్ చేసేందుకు వెళ్లిన నలుగురు జర్నలిస్టులు కూడ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. తేనేటీగల దాడిలో పంచాయితీ సెక్రటరీ స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గతంలో కూడ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తేనేటీగల దాడిలో గాయపడిన విషయం తెలిసిందే.