ఒడిషా రైలు ప్రమాదం.. ఏపీ వాసులెవ్వరూ మరణించిన సమాచారం లేదు : మంత్రి బొత్స
ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదం ఘటనలో ఏపీ వాసులెవ్వరూ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని బొత్స కోరారు.
ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదం ఘటనలో ఏపీ వాసులెవ్వరూ ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన ప్రయాణీకులకు గాయాలైనట్లుగా తెలుస్తోందన్నారు. బాధితుల కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్, ముగ్గురు ఐఏఎస్లు, ముగ్గురు ఐపీఎస్లు ఒడిషాకు వెళ్లారని ఆయన చెప్పారు. బాధితులకు కటక్, భువనేశ్వర్లలోని ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశామని బొత్స తెలిపారు.
రాష్ట్రానికి చెందిన ప్రయాణీకులను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సత్యనారాయణ పేర్కొన్నారు. ఒడిషా ప్రభుత్వం, రైల్వే శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రమాదం జరిగిన రైళ్లలో ప్రయాణించిన వారి కుటుంబ సభ్యులు హెల్ప్లైన్ను సంప్రదించాలని బొత్స కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని సత్యనారాయణ పేర్కొన్నారు.
అయితే ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎక్కువ భాగం దెబ్బతిన్నట్టుగా చెబుతున్నారు. ఈ రెండు రైళ్లలో కూడా పలువురు తెలుగు ప్రజలు ఉన్నారు. దాదాపు 200 మంది వరకు తెలుగువారు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. అయితే రైల్వే శాఖ మాత్రం రిజర్వేషన్ చేయించుకున్న వారి వివరాలను మాత్రమే అందించగలుగుతుంది. జనరల్ బోగీలలో ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తెలియడం లేదు.
ALso Read: Odisha Train Accident: కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ఏపీ ప్రయాణికులు: రైల్వే అధికారులు..
ఇక, కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలలో స్టాప్లు ఉన్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 178 మంది ప్రయాణికులు ఈ స్టేషన్లో దిగేందుకు రిజర్వేషన్ చేయించుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. వారిలో 100 మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. జనరల్ బోగీల్లో ఎంతమంది ఏపీ ప్రయాణికులున్నారో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంలో అక్కడే చిక్కుకుపోయినవారిని తీసుకురావడానికి దక్షిణ రైల్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలులో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చనున్నారు.
ఒడిశాలోని భద్రక్ నుంచి శనివారం ప్రారంభమైన రైలు.. ఆదివారం ఉదయం 9 గంటల చెన్నై చేరుకోనుంది. రైలులో దాదాపు 250 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. రైలు ప్రమాద ఘటన సంబంధించి ఏపీలోని పలు రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం, సికింద్రాబాద్-040-27788516, విజయవాడ 0866-2576924, సామర్లకోట-7382629990, రాజమండ్రి-0883-2420541, ఏలూరు-08812-232267, తాడేపల్లి గూడెం-08818-226212, బాపట్ల-08643-222178, తెనాలి-08644-227600, నెల్లూరు-08612342028, ఒంగోలు-7815909489, గూడూరు-0862-4250795, రేణిగుంట-9121272320, 9493548008, తిరుపతి-7815915571, 9346903954 నెంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.