ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కారణంగా ఎస్ఈసీ పదవిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోల్పోయారని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటే టీడీపీ నేతలే ఎందుకు కోర్టును ఆశ్రయించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.


అమరావతి: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కారణంగా ఎస్ఈసీ పదవిని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోల్పోయారని ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటే టీడీపీ నేతలే ఎందుకు కోర్టును ఆశ్రయించారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఆదివారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఈసీగా తొలగించడంతో కోర్టుకు వెళ్లేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హక్కుంది. కానీ, ఆయన కంటే ముందే టీడీపీ నేతలు కోర్టును ఎందుకు ఆశ్రయించారో చెప్పాలన్నారు.

ఈసీ ఇచ్చిన సర్క్యులర్ ను కూడ ఎందుకు వెనక్కి తీసుకొందో చెప్పాలని ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. అడ్వకేట్ జనరల్ చట్టం తెలియని వ్యక్తి కాదన్నారు. 

టీడీపీకి వ్యక్తులే ముఖ్యం.. వ్యవస్థలు ఆ పార్టీకి అవసరం లేదన్నారు. అందుకే నిమ్మగడ్డ విషయంలో టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు. రమేష్ కుమార్ పై అభిమానంతో కోర్టుకు వెళ్లారా... ఇంకా మరేదైనా కారణం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పాటు పాలనను పూర్తి చేసుకొన్నారని ఆయన చెప్పారు. ఈ పాలనపై టీడీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు 90 శాతం పూర్తి చేశామన్నారు. కేవలం 16 అంశాలు మాత్రమే అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజల గుమ్మం వద్దకే పాలన తీసుకొస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి అదే దిశగా అడుగులు వేశారన్నారు.

1992 నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను.. ఎన్నో ప్రభుత్వాలు చూశాను, అనేక మంది ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో ఉన్నానని ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ, 
జగన్ నాయకత్వం లో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పారు.

చంద్రబాబు నాయుడు కూడా వీటిని ఖండించే పరిస్థితి లేదన్నారు. టిడిపి విమర్శలు అన్ని కోడిగుడ్డు పై ఈకలు పీకడమేనన్నారు. మేము మాట తప్పాం అని చెప్పే పరిస్థితి ప్రతిపక్షాలకు లేదన్నారు. 

also read:నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్: సర్క్యులర్ ఉపసంహరణ

చంద్రబాబు అప్పులు తెచ్చి దోచుకు తిన్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆయన ఆరోపించారు. రైతుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కొద్ది రోజుల్లో ప్రజల దగ్గరకు వెళుతున్నామని సీఎం చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. టిడిపి మానిఫెస్టో లో ఉన్న అంశాలు అధికారం లోకి వచ్చాక పట్టించుకోలేదన్నారు. 

also read:జగన్ కు హైకోర్టు షాక్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డనే, ఆర్టినెన్స్ రద్దు

500 యూనిట్స్ దాటిన వారికి మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచినట్టుగా మంత్రి తెలిపారు. మిగిలిన వారికి కరెంట్ బిల్లులో ఎటువంటి పెంపు లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ తప్పు చేసింది కాబట్టే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారు. మేం తప్పచేస్తే ప్రజలు తిరస్కరిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.