నేను కాపుల గుండెల్లో కుంపటినా.. నువ్వే శనివి, వాళ్లని గాడిదల్ని చేయొద్దు : పవన్కు అంబటి కౌంటర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కాపుల పాలిట శని అని.. కాపులందరినీ గాడిదలు చేయొద్దని ఆయన హితవు పలికారు.
తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారాహి పేరు మార్చుకోకపోతే పవన్ భ్రష్టుపట్టిపోతారన్నారు. తన మీద పవన్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. పవనే కాపుల గుండెల్లో కుంపటి అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రాంబాబు ఆరోపించారు. చంద్రబాబును పోలవరం గురించి ఏరోజైనా ప్రశ్నించావా అని మంత్రి ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతోనే కలిసి వెళ్తానని పవన్ స్పష్టం చేశారని రాంబాబు చురకలంటించారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్ అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 2 లక్షలు లంచం తీసుకున్నానని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. పవన్ కల్యాణ్ కాపుల శని అంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పోలవరం పూర్తి చేయకపోతే తాను మంత్రిని కాదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తానని చెప్పారని.. అప్పటి ఇరిగేషన్ మంత్రిని నువ్వు ఎందుకు ప్రశ్నించలేదని పవన్ను అంబటి నిలదీశారు.
అప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నావా అని మంత్రి ప్రశ్నించారు. కాపులందరినీ గాడిదలు చేయొద్దని ఆయన హితవు పలికారు. పవన్ కల్యాణ్కు చాలా మందితో విడిపోవడం అలవాటు అంటూ అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. 2019లో జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావ్ ఏమైందని మంత్రి ప్రశ్నించారు. తన వాహనానికి వారాహికి బదులుగా వరాహం అని పెట్టుకుంటే కొంతైనా మంచి జరుగుతుందని రాంబాబు చురకలంటించారు. రానున్న రోజుల్లో చంద్రబాబును గాడిదలాగా మోస్తానని పవన్ అంటున్నారంటూ రాంబాబు ఎద్దేవా చేశారు. గ్లాసుకు వేసే ఓట్లు మురిగిపోతాయని ఆయన జోస్యం చెప్పారు.
Also REad: దమ్ముంటే వారాహిని టచ్ చేయండి.. నేనేంటో చూపిస్తా : వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
అంతకుముందు ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా దోపిడి చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యేని తాను అంబటి అనేలోగా.. ఆయన ర్యాంబోలోగా మాట్లాడుతారని మండిపడ్డారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ముందు పోలవరం ఫినిష్ చేయాలని జనసేనాని చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వైసీపీ నేతల ఉత్తర కుమార ప్రగల్భాలకు తాము భయపడేది లేదని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత నాదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదని పవన్ ఆరోపించారు. తాను ఎప్పుడు ఏమైనా మాట్లాడదామన్నా కొన్ని వైసీపీ గాడిదలు బయటకొచ్చేస్తున్నాయన్నారు. వైసీపీ నేతలవన్నీ పనికిమాలిన మాటలేనని.. అంబటిది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని పవన్ ధ్వజమెత్తారు. తనకు సినిమాలే ఆధారమని.. అంబటిలాగా కాదని ఆయన తేల్చిచెప్పారు. మీరు నోరు పారేసుకుంటే తాను కూడా నోటికి పనిచెప్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలని.. మీరు తొక్కేస్తా మళ్లీ లేస్తానని ఆయన తేల్చిచెప్పారు. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం చెబుతానని పవన్ పేర్కొన్నారు. తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని.. తాను వారానికి ఓసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని జనసేనాని అన్నారు.