టీడీపీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలో కన్నా ఘనుడని, రాజకీయ బతుకుదెరువు కోసం చంద్రబాబు కాళ్ల దగ్గరకు చేరాడని అంబటి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంపై బురద జల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి అంబటి రాంబాబు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైసీపీ అధికార దుర్వినియోగం చేయలేదన్నారు. పట్టాభి గత ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడంలో కన్నా లక్ష్మీనారాయణ ఘనుడని రాంబాబు దుయ్యబట్టారు. రాజకీయ బతుకుదెరువు కోసం చంద్రబాబు కాళ్ల దగ్గరకు చేరాడని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాసాలు లెక్కపెట్టిన తర్వాత.. ఇప్పుడు టీడీపీలో చేరాడని అంబడి రాంబాబు అన్నారు. తెలుగుదేశంలో చేరడంతో కన్నా పూర్తి నైతిక విలువలను కోల్పోయినట్లయ్యిందని.. ఆయన గురించి ఇక్కడ ఎవరూ ఆలోచించడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. అలా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు. రాజకీయంగా కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా చనిపోయినట్లేనంటూ అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు గురువారం కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కన్నాకు కండువా కప్పిన చంద్రబాబు నాయుడు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. వారికి కూడా చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరు కన్నావారితోటలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వరకు అనుచరులతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 3 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇక, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. అయితే ఏపీ పునర్విభజన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. 2014లో కన్నా లక్ష్మీ నారాయణ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగోలేదనే ఆలోచనతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. 2019 ఎన్నికలకు ముందే పార్టీ మారతారనే ప్రచారం సాగింది. టీడీపీ, వైసీపీలు కన్నాతో చర్చలు జరిపాయనే వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ కూడా కన్నాను పార్టీలోకి చేర్చుకునేందుకు ఆసక్తికనబరిచడంతో.. ఆయన కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.
