బాపట్ల జిల్లా రేపల్లెలో కోడిపందాలు యధేచ్చగా సాగుతున్నాయి. నిజాంపట్నం , కొత్తపాలెం, ఈదురుపల్లి మండలాల్లో బరులు ఏర్పాటు చేసి కోడిపందాలు, గుండాటలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయాలు చేతులు మారుతున్నాయి.  

ఏపీలో అప్పుడే సంక్రాంతి సీజన్ మొదలైపోయింది. చాలా ప్రాంతాల్లో కోడిపందాలను నిర్వహిస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో భారీగా కోడిపందాలు జరుగుతున్నాయి. బరులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. నిజాంపట్నం , కొత్తపాలెం, ఈదురుపల్లి మండలాల్లో గుండాట నిర్వహిస్తున్నారు. కోడిపందాలు, గుండాటల్లో కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఫిర్యాదులు అందుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు.. గోదావరి జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కోడి పందెలు, వాటి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు హెచ్చరించారు. ఆదివారం కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని పలు పోలీస్ స్టేషన్‌లను పాలరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోడి పందాలు ఆడటం, నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. గతంలో కోడిపందాలు నిర్వహించిన వారి వివరాలు సేకరిస్తున్నామని డీఐజీ తెలిపారు.

వీరిపై ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ కేసులు నమోదు చేస్తామని.. రూ.5 లక్షల పూచీకత్తుతో స్టేషన్ బెయిల్ ఇస్తామని పాలరాజు పేర్కొన్నారు. అయినప్పటికీ పందాలకు పాల్పడితే ఈ మొత్తాన్ని సీజ్ చేసి.. వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కోనసీమ అల్లర్లకు సంబంధించి ఇంకా 50 మంది పరారీలో వున్నారని పాలరాజు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 251 మందిని అదుపులోకి తీసుకున్నామని... పరారీలో వున్న వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు డీఐజీ తెలిపారు. 

Also REad: కోనసీమలో మొదలైన కోడిపందాలు... కఠిన చర్యలు తప్పవు : పందెం రాయుళ్లకు డీఐజీ హెచ్చరికలు

ఇదిలావుండగా... సంక్రాంతి పర్వదినానికి ముందే తిరుపతి జిల్లాలో కోడి పందెలు ప్రారంభమయ్యాయి. పోలీసులను చూసిన పందెంరాయుళ్లు స్వర్ణముఖి నదిలో దూకి పారిపోయే ప్రయత్నం చేశారు.అయితే ఈ ఘటనలో ముగ్గురు నదిలో ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఒకరు మాత్రం గల్లంతయ్యారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

రేణిగుంట మండలం సుండికండ్రిగ కుమ్మరిపల్లె వద్ద కోడి పందెలు నిర్వహిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కుమ్మరిపల్లె వద్దకు చేరుకున్నారు. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన పందెంరాయుళ్లు వెంటనే స్వర్ణముఖి నదిలోకి పోలీసుల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ముగ్గురు నదిలో ఈదుకొంటూ అవతలి ఒడ్డువైపునకు చేరుకున్నారు. ఒకరు మాత్రం నదిలో గల్లంతైనట్టుగా సమాచారం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందెలపై నిషేధం ఉంది.పందెల సమయంలో వందల కోట్లు చేతులు మారుతాయి. ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందెలు నిర్వహిస్తారు.