Asianet News TeluguAsianet News Telugu

తెల్లవారుజామున నడిరోడ్డుపై వివాహిత డెడ్ బాడి... ప్రమాదమా? హత్యాచారమా?

ఇవాళ తెల్లవారుజామున విజయవాడలో రోడ్డుపైనే ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. ప్రమాదవశాత్తు మహిళ మృతిచెందిందా లేక హత్యాచారానికి పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Married Woman Dead Body Found In Suspicious at vijayawada
Author
Vijayawada, First Published Jan 17, 2022, 2:17 PM IST

విజయవాడ: గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద రీతిలో మృత్యువాతపడిన ఘటన కృష్ణా జిల్లా (krishna district) విజయవాడ (vijayawada)లో చోటుచేసుకుంది. రోడ్డుపై మహిళ మృతదేహం పడివుండటంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయిందా? లేక ఏదయినా అఘాయిత్యానికి పాల్పడి మృతదేహాన్ని తీసుకువచ్చి రోడ్డుపై పడేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే... విజయవాడలోని శిలామణి సెంటర్ లో ఓ 30ఏళ్ల మహిళ మృతదేహం రోడ్డుపై పడివుండటాన్ని స్థానికులు గుర్తించారు. వారు అందించిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలను సేకరించారు. అనంతరం మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

తెల్లవారుజామున వివాహితను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. సదరు మహిళ నిజంగానే ప్రమాదవశాత్తు మరణించిందా లేక అత్యాచారం చేసి హతమార్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తలకు బలమైన గాయం అవడంతో మహిళ మృతిచెందినట్లు ప్రాథమికంగా నిర్దారణ అయ్యింది. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే మహిళ ఎలా మృతిచెందిందో తేలనుంది. 

మృతురాలి వివరాలు తెలియాల్సి వుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలానికి దగ్గర్లోని సిసి కెమెరాల ఆధారంగా కేసును చేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

ఇదిలావుంటే కట్టుకున్న భార్య మరోవ్యక్తితో అసభ్యకరంగా వున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో మనస్థాపానికి గురయిన వ్యక్తి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. 

వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటుంది. ఆమె  భర్త స్వగ్రామం గోకవరంలోనూ... ఇద్దరు కుమారులు (13,10), కుమార్తె (12) అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. ఆటో నడుపుకునే తండ్రి అప్పుడప్పుడూ వెళ్లి  పిల్లల్ని చూసి వస్తుంటాడు.  

ఇదే క్రమంలో శనివారం సాయంత్రం పండగ అని చెప్పి వంగలపూడి వెళ్లాడు తండ్రి. ఇంట్లో కాసేపు గడిపి.. ఆ తరువాత  తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకు వెళ్ళాడు. నేరుగా వారికి గ్రామంలోని తోటలు ఉండే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ నిర్జనంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు తీసుకెళ్లిన ఎలుకల మందు తాగేశాడు. తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించే ప్రయత్నం చేశాడు.  

అయితే అది విషం అన్న విషయం తెలియని పిల్లలు.. తండ్రి కూడా తాగడంతో వారూ తాగడానికి ప్రయత్నించారు. కానీ అది చేదుగా ఉండడంతో.. పదేళ్ల చిన్న కుమారుడు మాత్రమే మందు తాగాడు. మిగతా ఇద్దరూ తాగలేదు. వారితో బలవంతంగా తాగించేలోపే అతను అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని వదిలేశాడు. అయితే తండ్రికి, తమ సోదరుడికి ఏం జరిగిందో తెలియని పిల్లలు అమాయకంగా అలాగే కూర్చున్నారు. కొద్దిసేపటికి వారిని అటుగా వెడుతున్న కొందరు స్థానికులు గమనించారు. 

వారికి విషయం అర్థం అయ్యింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని..  బాధితులను హుటా హుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం ఆదివారం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమీప బంధువుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వచ్చిందని.. దాంతో తాను మనస్థాపానికి గురై ఇలా చేశానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పాడు. అయితే అతడు చెబుతున్న వీడియో పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios