రాజకీయాల్లో వున్నంతకాలం సీఎం జగన్ వెంటేనని అన్నారు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కొద్దిరోజులు విదేశాల్లో వున్నందున తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిరోజులు విదేశాల్లో వున్నందున తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వున్నంతకాలం సీఎం జగన్ వెంటేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు ఎందుకు అసంతృప్తి వుంటుందని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు పంచే స్థలాలను సమాధులతో పోల్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇళ్లు లేని పేదలకు ఇవి తాజ్ మహల్స్ అంటూ ఆయన అభివర్ణించారు. మొత్తం 50 వేల మంది లబ్ధిదారుల్లో 22 వేల మంది మంగళగిరి నియోజకవర్గానికి చెందినవారేనని రామకృష్ణారెడ్డి తెలిపారు. లోకేష్ను ఓడించటానికే అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదన్నారు. లబ్ధిదారుల్లో 80 శాతం మంది ఈ ప్రాంతంవారే వుంటే బయట నుంచి కొత్తగా వచ్చే ఓటర్లు ఎవరని ఆర్కే ప్రశ్నించారు. రాజధానిలో పేదలు వుండకూదదనే చంద్రబాబు కుట్ర అని.. దీపావళి నాటికి మంగళగిరిలో జగనన్న కాలనీలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ALso Read: రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటే.. మీటింగ్కు రాకపోవడానికి కారణాన్ని పార్టీకి చెప్పాను: ఎమ్మెల్యే ఆర్కే
కాగా.. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా పార్టీ,ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా వుండటంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈసారి ఆర్కేకు కాకుండా మరో కొత్త నేతకు మంగళగిరి టికెట్ ఇస్తారంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
