పదిరూపాయల కోసం ఆటోడ్రైవర్ ని పొడిచేశారు...
పది రూపాయలకోసం ఓ వ్యక్తిని నలుగురు వ్యక్తులు కత్తితో పొడిచారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లా పాలకొండలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 10 రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆదివారం ఆటో డ్రైవర్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదివారం సాయంత్రం కోటదుర్గ ఆలయ కూడలి దగ్గర నలుగురి యువకులు కాంప్లెక్స్ కు వెళ్లాలని చెప్పి ఆటో ఎక్కారు. ఆటో పాలకొండకు చెందిన శ్రీనివాస్ రావు అనే వ్యక్తిది. మనిషికి పది రూపాయల చొప్పున చెల్లిస్తామని ముందే శ్రీనివాసరావు తో బేరం కుదుర్చుకున్నారు. అయితే దిగే టైం వచ్చేసరికి మాత్రం తక్కువ తీసుకోవాలంటూ వాగ్వాదానికి దిగారు.
అదే సమయంలో ఓ యువకుడు తన జేబులో ఉన్న కత్తిని తీసుకొని శ్రీనివాసరావు పొట్టపై పోటు పొడి చేశాడు. ఇది గమనించిన సమీపంలో ఉన్నవారు వెంటనే స్పందించారు. ఆ నలుగురిని పారిపోకుండా పట్టుకున్నారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ తర్వాత బాధితుడైన ఆటో డ్రైవర్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.