రూ.200కోసం వివాదం, హత్య
కేవలం రూ.200కోసం తలెత్తిన వివాదం.. ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.
కేవలం రూ.200కోసం తలెత్తిన వివాదం.. ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఈ దారుణ సంఘటన గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఏటీ అగ్రహారానికి చెందిన సి. వెంకటరమణ(60) పెయింటింగ్స్ వేస్తూ.. జీవనం గడుపుతున్నాడు. కాగా.. సోమవారం రాత్రి అతను తనతో కలిసి పనిచేసే మోహన్ అనే వ్యక్తితో కలిసి మద్యం సేవించాడు. అనంతరం ఇద్దరూ కలిసి.. ఓ చోట కూర్చొని పేకాట ఆడారు. ఈ పేకాటలో మోహన్ ఓడిపోగా..వెంకటరమణకి రూ.వెయ్యి ఇవ్వాల్సి వచ్చింది.
తన దగ్గర రూ.800లు మాత్రమే ఉండటంతో.. అవి ఇచ్చాడు. మిగిలిన రూ.200కూడా ఇవ్వాలంటూ వెంకటరమణ గొడవ చేశాడు. బలవంతంగా అతని జేబులో చేతులుపెట్టి.. డబ్బు కోసం వెతికాడు. తాగిన మైకంలో కోపోద్రిక్తుడైన మోహన్.. పక్కనే ఉన్న బండరాయితో వెంకటరమణ తల పగలకొట్టాడు.
అనంతరం వెంకటరమణ బైక్ వేసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లారి ఏమీ తెలియనట్టు.. బైక్ తీసుకువచ్చి వెంకటరమణ శవం దగ్గర పెట్టేశాడు. అయితే.. గతరాత్రి అనగా ఇంటికి వెళ్లిన వెంకట రమణ తిరిగి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీ అగ్రహారంలోని బ్రహ్మంగారి గుడి వద్ద ఓ వృద్ధుడు మృతిచెంది ఉన్నాడనే సమాచారంతో వెళ్లి పరిశీలిస్తే వెంకటరమణగా నిర్ధారణ అయింది.
మొదట అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తర్వాత పలువురిని విచారించగా.. మెహన్ ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.