దారుణం : భార్యపై అనుమానం.. ఏడాదిన్నర బిడ్డను చంపిన తండ్రి, వారం రోజులుగా అడవిలోనే మృతదేహం
భార్యపై అనుమానంతో పసికందు అని కూడా కన్నబిడ్డను దారుణంగా హతమార్చాడో తండ్రి. శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో దారుణం జరిగింది.
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఏడాదిన్నర చిన్నారిని కిరాతకంగా చంపాడో తండ్రి. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెనుగొండ పరిధిలోని అటవీ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
ఇకపోతే.. మరో ఘటనలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కర్కశంగా ప్రవర్తించాడో తండ్రి. కన్నబిడ్డ అని కూడా చూడకుండా పసిబిడ్డను నిర్దాక్షణ్యంగా ముళ్ల పొదల్లో పడేశాడు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బిడ్డను రక్షించారు. గుడివాడకు చెందిన దివ్య, మచిలీపట్నానికి చెందిన షాబాజ్లు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ హైదరాబాద్లో కలిసే వుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న దివ్యకు పురిటి నొప్పులు రావడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించాడు షాబాజ్.
అయితే ప్రసవ సమయంలో ఫిట్స్ రావడంతో బిడ్డకు జన్మనిచ్చి దివ్య మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహంతో పాటు బిడ్డను తీసుకుని అంబులెన్స్లో గుడివాడకు బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో పసికందును ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద ముళ్లపొదల్లో వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు పసికందును కాపాడి గన్నవరంలోని షేర్ అండ్ కేర్ సంస్థకు అప్పగించారు. అనంతరం షాబాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.