వివాదంలో మంత్రి ఆర్కే రోజా.. బీచ్ వద్ద ఆమె చెప్పులు చేతిలో పట్టుకున్న ఉద్యోగి..!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వివాదంలో చిక్కుకున్నారు. ఆమె చెప్పులను ఓ ఉద్యోగి తన చేతులతో పట్టుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి రోజా ఈరోజు బాపట్ల సూర్యలంక బీచ్ను సందర్శించారు. అయితే అక్కడ రోజా సముద్ర నీళ్లలోకి వెళ్లారు. కొద్దిసేపు సరదాగా గడిపారు. అయితే ఆ సమయంలో రోజా చెప్పులను ఓ ఉద్యోగి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి.
ఇదిలా ఉంటే.. సూర్యలంక పర్యాటక ప్రదేశాలపై టూరిజం శాఖ అధికారులతో మంత్రి రోజా సమీక్ష సమావేశం నిర్వహించారు. బాపట్ల సూర్యలంక బీచ్ అద్భుతమైన పర్యాటక ప్రాంతం అని మంత్రి రోజా అన్నారు. సూర్యలంక బీచ్ను మరింతగా అభివృద్ధి చేసి, పర్యాటకులను అమితంగా ఆకర్షించెలా ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ హరిత రిసార్ట్లను మరింతగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. బీచ్ దగ్గరలోని 8 ఎకరాల స్థలాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
సూర్యలంక బీచ్ సందర్శన సందర్భంగా రోజా మాట్లాడుతూ.. వైజాగ్ బీచ్ తర్వాత అంత ప్రాముఖ్యత గల బీచ్ సూర్యలంక బీచ్ అని అన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.