ఆకాశంలో వుండగానే గుండెపోటు... విమానంలోనే ప్రయాణికుడు మృతి
విమానం ఆకాశంలో వుండగా గుండెపోటుకు గురయి ఓ ప్రయాణికుడు మృతిచెందాడు.
విజయవాడ : విదేశాల నుండి స్వదేశానికి వస్తూ విమానంలోనే గుండెపోటుకు గురయ్యాడు ఓ వృద్దుడు. విమానం ఆకాశంలో వుండగా వృద్దుడికి గుండె నొప్పి మొదలై సమయానికి వైద్యం అందలేదు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యేసరికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లా నిడదవోలుకు చెందిన చెక్కా నూకరాజు(85) కుటుంబంతో కలిసి దుబాయ్ లో స్థిరపడ్డాడు. అయితే త్వరలో బంధువుల ఇంట వివాహం వుండటంతో అతడు భార్యా కొడుకుతో కలిసి స్వదేశానికి బయలుదేరాడు. సోమవారం షార్జా విమానాశ్రయంలో ఎయిరిండియా విమానం ఎక్కిన వీరు గన్నవరం విమానాశ్రయంలో మరికొద్దిసేపట్లో దిగతారనగా నూకరాజుకు ఛాతిలో నొప్పి మొదలయ్యింది.
విమానం గాల్లో వుండగానే నూకరాజు గుండెలో నొప్పితో బాధపడగా సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. గన్నవరం విమానాశ్రయ అధికారులకు నూకరాజు పరిస్థితిపై ముందుగానే సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ ను రెడీగా వుంచారు. కానీ విమానం గన్నవరంలో ల్యాండ్ అయ్యేలోపే నూకరాజు ప్రాణాలు కోల్పోయాడు. వైద్యసిబ్బంది అతడిని పరిశీలించి చనిపోయాడని నిర్దారించారు.
Read More హార్ట్ ఎటాక్ తో మగవారి కంటే ఆడవారే ఎక్కువ చనిపోతున్నారా?
పెళ్లి కోసమని బయలుదేరిన నూకరాజు ఇలా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబంలో విషాదాన్ని నింపింది. అతడి మృతదేహాన్ని స్వగ్రామం నిడదవోలులోనే అంత్యక్రియలు నిర్వహించారు. కొన్నేళ్ల కింద విదేశాలకు వెళ్లిన నూకరాజు ఇలా మృతదేహంగా తిరిగిరావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు.