ప్రేమవివాహం చేసుకున్న ఓ యువకుడు.. మూడు నెలలు గడవకముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించి, పెళ్లి చేసుకున్న యువతి తనమీద ఫిర్యాదు చేయడం.. పోలీసుల వేధింపులతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఏలూరు : ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరులో పోలీసుల వేధింపులతో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో తేజామూర్తి అనే ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
8 ఏళ్ల క్రితం తేజామూర్తి ప్రియాంక అనే యువతితో ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన మూడు నెలలలోపే వీరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. దీంతో ప్రియాంక ఇటీవల ఏలూరు వన్ టౌన్ లో తేజామూర్తిపై ఫిర్యాదు చేసింది.
యువకులతో అసహజ శృంగార యత్నమే కారణం... వీడిన విజయవాడ పార్క్ డెడ్ బాడీ మిస్టరీ...
వన్ టౌన్ సీఐ రాజశేఖర్ తేజామూర్తిని స్టేషన్కు పిలిపించారు. కౌన్సిలింగ్ పేరుతో సెటిల్మెంట్ చేసుకోవాలంటే వేధింపులకు గురి చేశాడు.అంతేకాదు, ప్రియాంక కుటుంబ సభ్యులు తేజామూర్తిని సెటిల్మెంట్ చేసుకోకపోతే కేసు నమోదు చేస్తామని పోలీసుల ద్వారా బెదిరించారు.
ప్రేమ వివాహం, భార్య వేధింపుల కేసు పెట్టడం.. పోలీసుల ఒత్తిడి, అత్తింటివారి బెదిరింపులతో తేజామూర్తి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలంలో తేజ రాసిన సూసైడ్ నోట్ లభించింది.
రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకోవడంతో రైల్వే సిబ్బంది తేజామూర్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిమీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
