తనతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని వివాహిత వేధించడం మొదలు పెట్టింది. దీంతో ఈ వేధింపులు తట్టుకోలేక అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం : ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వివాహిత వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా రాయదుర్గంలో చోటుచేసుకుంది. మృతుడు కుత్తీష్ అలియాస్ పృథ్వి (30). రాయదుర్గం పట్టణానికి చెందిన వ్యక్తి. అతను పట్టణంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత వారిద్దరి మధ్య చనువు ఏర్పడి ఫోన్ మాట్లాడుకోవడం, తరచుగా కలుసుకోవడం లాంటి సన్నిహితంగా మెలగడం చేశారు. ఆ సమయంలో ఇద్దరు కలిసి ఫోటోలు కూడా తీసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆ వివాహిత ఆ ఫోటోలను చూపించి పృథ్విని వేధించడం మొదలు పెట్టింది. దీంతో పృథ్వి ఒకసారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత సదరు వివాహిత కూడా పృథ్వి తనను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఒకరి మీద ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహేతర సంబంధం ... ప్రియురాలిని చంపి ఆమె కూతురికే ఫోన్ చేసిన నిందితుడు
ఆ తరువాత వారం రోజుల కిందట జరిగిన స్పందన కార్యక్రమంలో సదరు వివాహిత ఎస్పీని కలిసి దీనిమీద మరోసారి ఫిర్యాదు చేసింది. అప్పటికే కేసు కూడా నమోదయి ఉండడంతో పోలీసులు వీరిద్దరిని పిలిపించి విచారణ చేశారు. తిరిగి విచారణ కోసం శనివారం నాడు రావాలని ఇద్దరికీ సమాచారం అందించారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి పృథ్వికి ఫోన్ చేసిన వివాహిత తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. అప్పటికి ఆమె వేధింపులతో విసిగిపోయిన అతను వెళ్లలేదు.
దీంతో రావాలని చెబుతూ మరో వ్యక్తిని పంపించింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పృథ్వి ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత.. వివాహిత ఇంటికి వెళ్లిన విషయాన్ని తన భార్య లలితకు తెలిపాడు పృథ్వీ. అది విన్న ఆమె భర్తతో… శనివారం పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి ఉందని.. ఆమె ఎవరిని పంపినా ఇంకొకసారి తన దగ్గరికి వెళ్లొద్దని చెప్పింది. ఆ తర్వాత ఉరవకొండలో బంధువుల వివాహం ఉందని అక్కడికి వెళ్లి వచ్చాక పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేద్దామని భార్య పృథ్వికి నచ్చ చెప్పింది.
శుక్రవారం ఉదయాన్నే బంధువుల పెళ్లి కోసం ఉరవకొండకు బయలుదేరింది లలిత. అయితే మార్గమధ్యలో ఉండగానే ఆమెకి ఫోన్ వచ్చింది. భర్త పృథ్వి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. ఈ విషయం విని షాక్ అయినా లలిత బోరున విలపిస్తూ వెనుతిరిగింది. ఆ తర్వాత తన భర్త ఆత్మహత్యకు వివాహిత వేధింపులే కారణమని పోలీసులకు ఆమె మీద ఫిర్యాదు చేసింది. అయితే దీని మీద పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని లలిత నిరసన తెలిపింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు పృథ్వి వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు. దీంతో అతనికి చాలామంది స్నేహితులు ఉన్నారు. అతని ఆత్మహత్య విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున స్నేహితులు ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ రద్దీ ఏర్పడింది. ఇక సదరు వివాహిత బంధువులు కూడా పట్టణంలో చాలామంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
