నెల్లూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యకు మళ్ళీ పెళ్లిచేశారని తెలిసి.. ఓ యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.

నెల్లూరు : తాను వివాహం చేసుకున్న యువతికి ఆమె తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేశారనే విషయాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు అనంతపురంలోని గౌరీ థియేటర్ సమీపంలో నివసిస్తున్న బాలకృష్ణ సింగ్ రాడ్ బెండింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తిరుమలకు వెళ్లిన ఆయనకు కలువాయి మండలానికి చెందిన ఓ యువతితో పరిచయమై అది ప్రేమగా మారింది.

ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను కావలిలోని తమ బంధువుల ఇంట్లో ఉంచి వివాహానికి ప్రయత్నాలు చేశారు. దీంతో గతేడాది మేలో బాలకృష్ణ సింగ్, యువతి పారిపోయి వివాహం చేసుకుని అనంతపురంలో కాపురం పెట్టారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన కావలి పోలీసులు అనంతపురంలో ఉన్న వీరిని తీసుకువచ్చారు.

యువతి తల్లిదండ్రులు పెద్దల సమక్షంలో పదిరోజుల్లో వివాహం చేస్తామని తమ కుమార్తెను వెంట తీసుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆమె జాడ తెలియరాలేదు. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో బాలకృష్ణ సింగ్ పెట్టడంతో యువతి కుటుంబ సభ్యులు దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణకు గాను ఈ నెల 6న ఆయన హాజరయ్యారు. అతని మొబైల్ ఫోన్ లోని ఫోటోలను పోలీసులు డిలీట్ చేయించి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటిరోజు కౌన్సెలింగ్ చేశారు.

ఈ క్రమంలో తన కుమార్తె వివాహం చేశామని, ఆమె జోలికి రావద్దని తల్లిదండ్రులు సూచించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఫోన్ కోసం దిశ పోలీస్ స్టేషన్ కు బుధవారం బయలుదేరిన బాలకృష్ణ సింగ్.. సమీపంలోని చెట్ల వద్ద తలకు రాసుకునే ఆయిల్ ను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం జిజిహెచ్ లో చేర్పించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసును బుధవారం అర్ధరాత్రి నమోదు చేశారు.

కాగా, స్పృహ తప్పిన భార్యను బతికుండగానే తగలబెట్టాడు ఓ భర్త. ఈ దారుణమైన సంఘటన bhiwandi స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంతోష్ చౌరాసియా తన భార్య కవిత, ఇద్దరు పిల్లలతో కలిసి కేంద్రంలోని మహాంకాళి దాబా పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. కూలీ పనిచేసే సంతోష్ వ్యసనాల కారణంగా పనికిపోక తరచుగా భార్యతో గొడవ పడేవాడు.

మంగళవారం మద్యం సేవించిన సంతోష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశంతో సంతోష్ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వచేసిన కర్రలకుప్ప దగ్గరకు కవితను లాక్కొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి.. నిప్పు అంటించి.. హత్య చేసి పారిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.