వీరేష్ ఆచూకీ లభ్యం: పోలీసుల అదుపులో కిడ్నాపర్
తిరుమల కొండపై రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన వీరేష్ అనే బాలుడి ఆచూకీ లభ్యమైంది.
తిరుపతి: తిరుమల కొండపై రెండు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన వీరేష్ అనే బాలుడి ఆచూకీ లభ్యమైంది. మహారాష్ట్రలో వీరేష్ ఆచూకీ లభ్యమైంది. బాలుడిని తిరుపతికి తీసుకొచ్చేందుకు తిరుపతి పోలీసులు మహారాష్ట్ర బయలుదేరారు.
తిరుమలకు వచ్చిన దంపతులు కళ్లుగప్పి వీరేష్ అనే చిన్నారిని శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి కిడ్పాప్ చేశారు. నిందితుడిని సీసీటీవి పుటేజీ ద్వారా గుర్తించిన పోలీసులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
సామాజిక మాధ్యమాల్లో వీరేష్ కిడ్నాప్ గురించి విస్తృతంగా ప్రచారమైంది. మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మామనూరు పోలీసులకు వీరేష్ గురించిన సమాచారాన్ని స్థానికులు ఇచ్చారు.
సామాజికి మాధ్యమాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా స్థానికులు వీరేష్ ను గుర్తించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. వీరేష్ ఆచూకీని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నాందేడ్ నుండి వీరేష్ ను తిరుపతికి తీసుకువచ్చేందుకు తిరుపతి పోలీసులు మహారాష్ట్ర బయలుదేరి వెళ్లారు.
శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు మహరాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు వచ్చారు. వసతి దొరకకపోవడంతో ఆరుబయటనే వారంతా నిద్రించారు. అయితే ఈ సమయంలోనే వీరేష్ ను నిందితుడు కిడ్నాప్ చేశాడు.