ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు: లోకేష్
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్సే లేదని ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్సే లేదని ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తికాలం అధికారంలో కొనసాగాలనేది తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ అని వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణలో అలా జరగకపోవడం విచారకరమన్నారు లోకేష్.
ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరగనున్నాయంటూ వస్తున్న వార్తన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనన్నారు. అదంతా తప్పుడు ప్రచారమని లోకేష్ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఎన్నికలపై ఆలోచన లేదని, అభివృద్ధి పనుల్లో తమ ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు.
తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్లపాటు నడవకపోవడం దురదృష్టకరమని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఐదేళ్లు ప్రభుత్వం ఉండాలన్నది తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించేందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు బాబ్లీ కోసం పోరాడారని లోకేష్ గుర్తు చేశారు.