ముగిసిన మూఢం, తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి... ఒక్క డిసెంబర్లోనే ఒక్కటి కానున్న లక్షలాది జంటలు
మూఢం ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి 18 వరకు బలమైన ముహూర్తాలు వుండటంతో రెండు రాష్ట్రాల్లో వేలాది జంటలు ఒక్కటికానున్నాయి.
తెలుగు నాట మళ్లీ కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. గత కొద్దిరోజులుగా మూఢం కారణంగా మంచి రోజులు లేకపోవడంతో వివాహాలకు మంచి ముహూర్తాలు లేవు. ప్రస్తుతం మూఢం పోవడంతో పెళ్లిళ్లు , ఎంగేజ్మెంట్లు ఇతర శుభకార్యాలు జరుగుతున్నాయి. పెళ్లిళ్లి సందడితో కళ్యాణ మండపాలు, వంటవాళ్లు, ఈవెంట్ మేనేజర్లు, డెకరేషన్ వంటి ఇతర అనుబంధ రంగాలకు చెందిన వ్యాపారాలు జోరందుకున్నాయి. వరుస వివాహాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కూడా కళకళలాడుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి 18 వరకు బలమైన ముహూర్తాలు వుండటంతో రెండు రాష్ట్రాల్లో వేలాది జంటలు ఒక్కటికానున్నాయి.
కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లు, ఆడిటోరియంలు అన్నీ బుక్ అయిపోయాయి. దీంతో చాలా మంది చేసేది లేక ఆలయాల్లోనే వివాహ తంతును కానిచ్చేయాలని చూస్తున్నారు. విదేశీ ప్రయాణాలపై కరోనా ఆంక్షలు తొలగడం, డిసెంబర్లో ఎన్ఆర్ఐలకు ఎక్కువగా సెలవులు రావడంతో పెళ్లిళ్లు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో పెళ్లిళ్లు నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు రంగంలోకి దిగాయి. డిసెంబర్ తర్వాత మళ్లీ మాఘ మాసంలోనే పెళ్లిళ్లకు మంచి రోజులు వున్నాయి. అలాగే ఏప్రిల్లో ఉగాది తర్వాత మళ్లీ మూఢం రానుండటంతో ఎలాగైనా మూడు ముళ్లు వేయించాలని పెద్దలు సిద్ధపడుతున్నారు.