కర్నూలులోని ఆలూరులో పట్టా పాస్ బుక్లు అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. లేని భూమికి పాస్ బుక్లు తయారు చేసి వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లక్షల్లో రుణాలు పొందుతున్నట్టు తెలిసింది. ఆలూరు మండలంలో ఇలా అక్రమంగా ఐదు వేల ఎకరాలకు పట్టాలు సృష్టించారని, ఒక ఎకరా భూమికి నకిలీ పట్టా చేయడానికి రూ. 10 వేలు దండుకున్నారని సమాచారం.
అమరావతి: కర్నూలు జిల్లాలో అక్రమ పాస్ పుస్తకాల దందా గుట్టు రట్టు అయింది. భూమి లేకున్నా.. అక్రమంగా నకిలీ పాస్ బుక్లను ఆలూరు రెవెన్యూ ఆఫీసులు సృష్టించినట్టు తేలింది. మండలంలో సుమారు ఐదు వేల ఎకరాల భూమికి ఇలా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసినట్టు తెలిసింది. అంటే.. నిజంగా ఈ ఐదు వేల ఎకరాల భూమి లేదు. కానీ, కేవలం కాగితాలపై అంటే.. పట్టాదారుల పాస్ బుక్లలపై మాత్రమే ఈ భూమి కనిపిస్తుంది. అంతేకాదు, కేవలం పట్టాదారు పాస్బుక్ మాత్రమే కాదు.. ఆన్లైన్లోనూ అప్డేట్ చేసినట్టు సమాచారం. కాగా, ఈ నకిలీ పట్టాదారు పాస్ బుక్లతో కొందరు బ్యాంకుల్లోనూ లక్షల రుణాలు పొందినట్టు తెలిసింది. ఈ నకిలీ పాస్ బుక్లను తాకట్టు పెట్టి ఈ రుణాలు పొందారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఈ అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నట్టు వెలికి వచ్చింది. అయితే, రెవెన్యూ అధికారులు ఈ తప్పును అంగీకరించడం లేదు. చిన్న చిన్న పొరపాట్లతో ఇలా నకిలీ పట్టా పుస్తకాలు వచ్చి ఉండొచ్చని కొట్టేసే ప్రయత్నం చేశారు.
కానీ, కొంత మంది దళారులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై బయట కర్నూలులో హోటల్లో సమావేశమై ఈ దందాకు తెరతీసినట్టు సమాచారం. ఒక్క ఎకరా భూమికి నకిలీ పట్టా పాస్ బుక్ చేయడానికి పది వేల రూపాయలు దండుకుంటున్నారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఈ వ్యవహారంపై సమాచారం ఉన్నది. కానీ, ఇప్పటి వరకైతే.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది.
