ఆదోని అయినా ఇస్తారా లేదా: అయోమయంలో ఎంపీ బుట్టా రేణుక
ఆదోని అయినా ఇస్తారా లేదా: అయోమయంలో ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు: తెలుగుదేశం పార్టీలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి దయనీయంగా మారింది. తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అన్న అంశం ఆమె చేతుల్లో లేకుండా పోయిందంటూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు.
2014 ఎన్నికల్లో బుట్టా రేణుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీకి అనుంబంధంగా మారిపోయారు.
తొలుత తెలుగుదేశం పార్టీలో చేరాలని భావించినప్పటికీ పార్టీ ఫిరాయింపు సమస్య ఎదురవుతుందని ముందే ఊహించిన ఆమె భర్తను మాత్రమే టీడీపీలో చేర్పించి ఆమె మాత్రం అనుబంధంగా కొనసాగుతున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు.
దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయారు. రాబోయే ఎన్నికల్లో బుట్టా రేణుక కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యాలని భావించారు. అందుకు చినబాబు లోకేష్ మద్దతు కూడగట్టుకున్నారు. కొద్దిరోజులు ఆమె కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా అంతా భావిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చారు.
కర్నూలు ఎంపీ టికెట్ బుట్టా రేణుకకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశారు. ఈ విషయం తెలిసిన రేణుక చంద్రబాబుతో చర్చించారు. అయినప్పటికీ చంద్రబాబు తన నిర్ణయం మార్చుకోలేదు. మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా బుట్టా రేణుకను ఎంపిక చెయ్యాలని సూచించినప్పటికీ లోకేష్ రికమండేషన్ ను కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు.
ఈసారి అసెంబ్లీకి పంపిద్దామంటూ చెప్పుకొచ్చారు. తొలుత ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని సూచించారు. అసెంబ్లీకి పోటీ చెయ్యడంపై బుట్టా రేణుక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ కర్నూలు ఎంపీగానే పోటీ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ప్లాన్స్ ఏవీ వర్కవుట్ అయ్యేట్లు కన్పించడం లేదు.
ఈనెల 28న తెలుగుదేశం పార్టీలోకి కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం సైకిలెక్కనుంది. ఇప్పటికే కర్నూలు పార్లమెంట్ టికెట్ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కేటాయించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన భార్య కోట్ల సుజతామ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు
కర్నూలు పార్లమెంట్ నుంచి కోట్ల పోటీ చెయ్యనున్న నేపథ్యంలో బుట్టా రేణుక ఆశలన్నీ ఆవిరైపోయాయి. దీంతో ఎమ్మిగనూరు అసెంబ్లీ నుంచి అయినా పోటీ చేద్దామని భావించిన ఆమెకు అక్కడా గట్టి షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలని సూచించారు. ఎంపీగా పోటీ చేద్దామంటే అందుకు ససేమిరా అన్నారు.
ఎమ్మిగనూరు నుంచిపోటీ చెయ్యాలని ఆదేశించారు. పోనీ అక్కడా నుంచైనా పోటీ చేద్దామని భావిస్తుంటే ఇప్పుడు ఆదోని అంటున్నారు. ఆదోని కూడా ఖచ్చితంగా చెప్పడం లేదట. సర్వేలు జరుగుతున్నాయని చెప్పారట. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, బుట్టా రేణుకలపై సర్వే జరుగుతోందని సర్వేలో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి టికెట్ కేటాయిస్తామని చెప్పుకొచ్చారట.
అయితే మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు తన ప్లాన్స్ ని కూడా మారుస్తున్నారు చంద్రబాబు. ఆదోని నియోజకవర్గం నుంచి మీనాక్షి నాయుడ్ని కాకుండా బుట్టా రేణుకను నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. టికెట్ కన్ఫమ్ అయ్యిందని సంబరపడాలో ఏం చెయ్యాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉన్నారట బుట్టా రేణుక.
ఎంపీగా పోటీ చేస్తే తన వ్యాపారాల రీత్యా ఉపయోగకరంగా ఉంటుందని అదే ఎమ్మెల్యేగా అయితే నియోజకవర్గానికే పరిమితం కావాల్సి ఉంటుందని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఇప్పటికే తన అనుచరులతో కూడా బుట్టా రేణుక చర్చించినట్లు తెలుస్తోంది. అనవసరంగా పార్టీ మారామా అనే ఆలోచనలో కూడా ఉన్నారట బుట్టా రేణుక.