కోర్టు పరీక్షల్లో  ప్రశ్నాపత్రం  బయటకు పంపిన ఘటనలో ముగ్గురిపై  పోలీసులు  కేసు నమోదు చేశారు.  ఈ ముగ్గురిని  పోలీసులు అరెస్ట్  చేశారు.టెలిగ్రామ్ యాప్ ద్వారా   ప్రశ్నాపత్రం  బయటకు పంపినట్టుగా  పోలీసులు గుర్తించారు

విజయవాడ: కోర్టు ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న పరీక్షా ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ముగ్గురిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లను అనుమతించలేదు. అయినా కూడా సెల్ ఫోన్ ను నిందితుడు ఎలా తీసుకెళ్లారనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షకు మనీష్ కుమార్ అనే అభ్యర్ధి హాజరయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెడనలో గల వాసవీ ఇంజనీరింగ్ కాలేజీలో మనీష్ పరీక్షకు హాజరయ్యారు. తన వెంట తెచ్చుకున్న సెల్ ఫోన్ ద్వారా మనీష్ ప్రశ్నాపత్రాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా తన సోదరుడు వరుణ్ కు పంపాడు. బాపట్లలో ఉన్న వరుణ్ కుమార్ ఈ ప్రశ్నాపత్రాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలోని తన స్నేహితుడు నాగరాజుకు పంపాడు. ఈ విషయం వెలుగు చూడడంతో పోలీసులు మనీష్, వరుణ్ కుమార్, నాగరాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రశ్నాపత్రాన్ని ఎవరెవరకి పంపారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred