జీతాల కోసం రోడ్డెక్కిన కోవిడ్ డాక్టర్లు... విజయవాడలో నిరవధిక సమ్మె (వీడియో)
కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి చేసిన సేవలకు మీరిచ్చే గౌరవమేది? అంటూ కృష్ణా జిల్లాకు చెందిన కోవిడ్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఆరు నెలల జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ సమ్మెకు దిగారు.
విజయవాడ: కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యసేవలు అందించిన కోవిడ్ డాక్టర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. ఇవాళ్టి(బుధవారం)నుండి విజయవాడలో నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. కోవిడ్ విధులు చేపట్టిన తమకు ప్రభుత్వం ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదని... బకాయిపడ్డ జీతాలు పెంచిన ప్రకారం చెల్లించేవరకు విధులకు హాజరుకామని డాక్టర్లు స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లాలో 200 మంది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కోవిడ్ విధులు నిర్వహించారు. సరైన సదుపాయలు లేకపోయాని తాము విధులు నిర్వహించామని... దీంతో చాలామంది కోవిడ్ బారిన పడ్డారని డాక్టర్లు తెలిపారు. మరికొందరు సుదూర ప్రాంతాల నుండి వచ్చి కొవిడ్ సేవలు చేస్తున్నారని తెలిపారు.
వీడియో
''కోవిడ్ ఫస్ట్ వేవ్ లో జీతాలు కూడా ప్రభుత్వం పెండింగ్ పెట్టింది. ఇప్పుడు ఆరు నెలలుగా జీతాలు లేవు. మిగతా జిల్లాలలో జీతాలు ఇచ్చారు.. కృష్ణాజిల్లాలో మాత్రం బిల్లే పెట్టలేదు. అందుకోసమే వెంటనే జీతాలు చెల్లించాలన్న డిమాండ్ తో డీఎంహెచ్ఓ, సూపరింటెండెంట్ లకు ఐదు రోజుల ముందే ఇచ్చి సమ్మె నోటీసులు ఇచ్చాం. ఇవాళ ధర్నాకు దిగాం'' అని డాక్డర్లు తెలిపారు.