ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌‌పై కోడి కత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్‌ఐఏ కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌‌పై కోడి కత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్‌ఐఏ కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన సీఎం జగన్‌ను విచారణకు హాజరుకావాలని కోర్టు కోరిన సంగతి తెలిసిందే. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్ కమీషనర్ ద్వారా సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు అనుమతించాలని సీఎం జగన్ కోర్టును అభ్యర్థించారు. అలాగే కోడిపందాల కోసం ఉపయోగించే కత్తిని ఉపయోగించి తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు జరపాలని ఎన్‌ఐఏను ఆదేశించాలని సీఎం జగన్ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో సీఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్ఐఏ కోర్టు ఈ పిటిషన్లను ఏప్రిల్ 13న విచారణకు స్వీకరించనున్నట్టుగా తెలిపింది. 

ఈ క్రమంలోనే నేడు ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ కౌంటర్ దాఖలు చేసింది. కోడికత్తి కేసులో కుట్రలేదని ఎన్‌ఐఏ తెలిపింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్‌కు ఘటనతో సంబంధం లేదని పేర్కొంది. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేలిందని చెప్పింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందుకు ఇంకా దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టవేయాలని కోర్టును అభ్యర్థించింది.

అయితే వాదనలకు సమయం కావాలని జగన్ తరఫున న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను సోమవారానికి (ఏప్రిల్ 17) వాయిదా వేసింది.