Asianet News TeluguAsianet News Telugu

ఆటోలో మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా.. వైరల్ అవుతున్న ఫొటో.. అసలేం ఏం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధాలు ఎప్పుడూ కలిసిన అదో వార్తగా మారుతుందనే సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు నేతలు ఆటోలో కూర్చొని టీ తాగుతూ ముచ్చటించుకున్న ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Kodali Nani and Vangaveeti Radha sip tea sitting in auto in gudivada
Author
Gudivada, First Published Mar 20, 2022, 10:23 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధాల మధ్య చాలా కాలంగా స్నేహ బంధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నాని ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా.. మరోవైపు వంగవీటి రాధా టీడీపీ ముఖ్య నేతగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇరువురు నేతలు ఎప్పుడూ కలిసినా అదో వార్తగా మారుతోంది. వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. అయితే అది కార్యరూపం దాల్చడం లేదు.

ఇటీవల వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారనే అంశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా వంగవీటి రాధా ఇంటికెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంలో తాను పార్టీ మారడం లేదని రాధా.. టీడీపీ నేతలకు చెప్పినట్టుగా తెలిసింది. 

అయితే తాజాగా కొడాలి నాని, వంగవీటి రాధా.. గుడివాడలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్  అడపా వెంకట రమణ (బాబ్జి) అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాబ్జి కుటుంబ సభ్యులను పరామర్శించిన నేతలు.. ఓ ఆటోలో కూర్చుని ఛాయ్ తాగుతూ కనిపించారు. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతలు ఇలా టీ తాగుతూ.. ఆటోలో కూర్చొని మాట్లాడుకోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోసారి వంగవీటి రాధా పార్టీ మారే అంశం తెరమీదకు వచ్చింది.


ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ టీడీపీ నేతలు ఆయనతో ఇంత కలుపుగోలుగా ఉండటం అరుదనే చెప్పాలి. రాధా కూడా కొడాలి నానితో ఉన్నంత సన్నిహితంగా టీడీపీ నేతలతో ఉండరని టీడీపీ శ్రేణులే చెబుతుంటాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios