Kia Engine Theft: ఏపీలోని కియా కార్ల కంపెనీలో ఇంజిన్లు చోరీ కేసులో పురోగతి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కియా కారు పరిశ్రమకు చెందిన ఇంజిన్లు సుమారు 900 వరకు చోరీకి గురైన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు క్షుణ్నంగా విచారణ జరుపుతున్నారు. చోరీకి పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే.. ఒక్కసారే 900 ఇంజిన్లు మాయం అవడం వెనుక పెద్ద ముఠా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంజిన్లు తరలించేందుకు వినియోగించిన లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కియా పరిశ్రమ నుంచి ఇంజిన్లు తరలించిన లారీలను పోలీసులు గుర్తించారు. తమిళనాడు రాష్ట్రంలో ఐదు లారీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఇంజిన్లు చోరీ చేసిన ముఠా ఆచూకీ లభ్యం కాలేదు. వీరికోసం ముమ్మరంగా పోలీసులు గాలిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమ (KIA)లో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమయ్యాయి. 900 ఇంజిన్లు కనిపించడం లేదంటూ కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.
దాదాపు నెలరోజుల తర్వాత పోలీసులు దొంగలను పట్టుకున్నారు. మార్చి 19న కార్ల ఇంజిన్లు 900 వరకు మాయమయ్యాయని పంచాయతీ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బయటకు రాగానే పోలీసులతోపాటు అందరూ షాక్కి గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 900 వందల ఇంజిన్లు మాయం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల విచారణ సాగిందిలా...
కియా కార్ల ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిసిన వెంటనే ఏపీ ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణ కొనసాగించింది. అన్ని విధాలుగా విచారిస్తున్న పోలీసు బృందం తమిళనాడుకు చెందిన 9 మందిని అరెస్ట్ చేసింది. అయితే... వారు ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నారా? లేదా గతంలో చేశారా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. వీరి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
వేల కార్లను ఉత్పత్తి చేసే సంస్థలో ఆడిట్ జరిగిన సమయంలో.. ఇంజిన్లు పోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నెలరోజులుగా సీసీ కెమెరాలు, తదితర వివరాలను క్షున్నంగా పరిశీలించి 9 మందిని అరెస్టు చేయగా.. వారిని విచారించిన తర్వాత మరింత మంది అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని వెనుక కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.
కియాకార్ల ఇంజిన్లు విదేశాల నుంచి ఇండియాకు వస్తాయి. తొలుత చెన్నై పోర్టుకు కార్లు చేరుకుంటాయి అక్కడి నుంచి పరిశ్రమ వద్దకు కంటైనర్లలో తరలిస్తారు. అయితే... చోరీ ఎక్కడ జరిగింది అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. పోర్టు వద్ద జరిగిందా లేదా కంటైనర్లలో వస్తున్న సమయంలో జరిగిందా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కియా వంటి అతిపెద్ద సంస్థలో అతి పెద్ద వ్యవస్థ ఉన్న సంస్థలో ఏకంగా 900 ఇంజిన్లు మాయంకావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇంజిన్లు కంపెనీకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లాయా లేదా.. తెచ్చేటప్పుడే చోరీ జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై విచారణ చేయాలని మౌఖికంగా సంస్థ పోలీసులకు చెప్పగా.. వారు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నారు. అయితే.. చోరీకి పాల్పడింది గతంలో పనిచేసిన ఉద్యోగుల పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అయిదు లారీలు, తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారస్తున్నారు. అయితే.. ఈ చోరీ వెనుక పెద్ద మాఫియా ముఠా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఖరీదైన కారు ఇంజిన్లను ఎక్కడికి తరలించారు. ఎక్కడ విక్రయించారు అన్నది తేలాల్సి ఉంది.