Asianet News TeluguAsianet News Telugu

చేతులు కలిపిన కేసీఆర్, జగన్: జలవివాదాలకు ఇక తెర

మెుత్తంమీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయితే జూలై 3న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల సీఎస్ లు గవర్నర్ సమక్షంలో సమావేశమై ఏకాభిప్రాయంతో సెటిల్ చేసుకున్న అంశాలపై నివేదికను గవర్నర్ నరసింహన్ కు అందజేయనున్నారు.  

KCR, YS Jagan to resolve river water disputes
Author
Amaravathi, First Published Jun 26, 2019, 12:22 PM IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ఇకపై ఇచ్చుపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను ఫ్రెండ్లీగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఇరు రాష్ట్రాలు సఖ్యతతో ముందుకు వెళ్లాలని అలాగే రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధనకు ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య బంధం మరింత బలపడేందుకు అలాగే విభజన చట్టంలోని సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పంపకాలపై చర్చించనున్నారు కేసీఆర్, జగన్. 

ఈనెల 28న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి రాష్ట్రాల మధ్య సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రగతిభవన్ వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిలు జలవివాదాలు, విభజన సమస్యలపై చర్చించనున్నారు. 

అలాగే 

గోదావరి నీటిని కృష్ణాకు తరలించే ప్రతిపాదన, 

విద్యుత్​ బకాయిలు, ఉద్యోగుల పంపకం, 
తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజనలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యల పరిష్కారం ఒక కొలిక్కి వస్తే జూలై 3న గవర్నర్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

గతంలో తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు నెలకొన్నాయి. ఢిల్లీలో ఏపీ భవన్​ మాదేనంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అలాగే కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉంది. తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు అప్పుల పంపిణీకి షీలాభిడే కమిటీ సిఫారసులపై కూడా గందరగోళం నెలకొంది. 

అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పంతాలు వీడి తెలంగాణ, ఏపీ మధ్య పెండింగ్​లో ఉన్న వివాదాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సెటిల్​ చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 

ఈనెల 28న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందిన సీఎస్ లు ఆయా విభాగాల ఉన్నతాధికారులు చర్చలకు సంబంధించి ఎజెండాను రూపొందించేపనిలో పడ్డారు.  

ముఖ్యంగా గోదావరి నీటిని కృష్ణాకు తరలించే సాధ్యాసాధ్యాలతోపాటు ఇరు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల రూపకల్పనలపై ప్రధానంగా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సాగునీటి రంగ నిపుణులతో పాటు రెండు రాష్ట్రాల అధికారులు సుమారు 60 మంది ఈ చర్చల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం, చర్చల అనంతరం వాటి తీర్మానాలను వేగవంతంగా అమలు చేసేలా తదుపరి కార్యచరణను కూడా వేగవంతం చేసేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి.  

ఇప్పటికే 

హైదరాబాద్​ సచివాలయంలోని తమ భవనాలను ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. దాంతో గతంలో పెండింగ్ లో ఉన్న విద్యుత్‌‌, నీటి బిల్లుల బకాయిలను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

అయితే ఆదర్శనగర్​లోని హెర్మిటేజ్​ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి అప్పగించింది. ఇకపోతే ఏపీపీఎస్సీ విభజన, టీఎస్​పీఎస్సీ భవనాల పంపిణీపై ఎలాంటి క్లారిటీ రాలేదు. వీటి విభజన కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదు.  

ముఖ్యంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌‌ ను విభజించాలని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోరింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంది. వారసత్వంగా హైదరాబాద్ స్టేట్ కు చెందిన ఆ బిల్డింగ్ తమకే చెదుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 


అలాగే 
విభజన చట్టంలో తొమ్మిది, పదో షెడ్యూళ్లలో పొందుపరిచిన కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ ఇప్పటికీ పూర్తి కాలేదు. షీలాభిడే కమిటీ సిఫార్సులపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. 

ఆస్తుల పంపకాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వాదనలు తలెత్తడంతో షీలాభిడే కమిటీ సిఫారసులను తాము పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. దాంతో అది కాస్త పెండింగ్ లో పడిపోయింది. 
 
అయితే ఎల్లుండి జరగబోయే సమావేశంలో షీలాభిడే కమిటీ సిఫారసులపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. షీలాభిడే కమిటీ ఇప్పటికే తొమ్మిదో షెడ్యూల్లోని 91 సంస్థల్లో 72 సంస్థలపై మార్గదర్శకాలు ఇచ్చింది. 

ప్రభుత్వ రంగ సంస్థల హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను 58:42 నిష్పత్తిలో పంచాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. వర్క్‌‌ షాపులు, గెస్ట్ హౌజ్ లు, ట్రైనింగ్​ సెంటర్లు, ఆసుపత్రుల వంటివి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని కేంద్రం సూచించింది. 

రెండు ప్రభుత్వాలు ఎవరికివారుగా తమకు అనువుగా అన్వయించుకోవటంతో ఆర్టీసీ, డెయిరీతో పాటు ఆర్థిక లావాదేవీలుండే సంస్థల విభజన అర్ధాంతగరంగా నిలిచిపోయింది. అయితే షీలాభిడే కమిటీ మార్గదర్శకాలు ఎలా ఉన్నా సామరస్యంగా వాటిని పంచుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  


మరోవైపు విద్యుత్​ బకాయిలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద వివాదమే నడుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణ ప్రభుత్వం తమకు విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వమే తమకు విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసుకున్నాయి. 

గతంలో విద్యుత్ కొనుగోలు, సరఫరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమకు రూ.3,378 కోట్లు బకాయి ఉందని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. మరోవైపు డిస్కంలు, ట్రాన్స్ కో, ఏపీ జెన్​కో నుంచి టీఎస్​ జెన్​కోకు రూ.5,783 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అన్ని లెక్కలు పోనూ తెలంగాణకే రూ.2,405 కోట్లు ఏపీ బకాయిలు చెల్లించాలంటూ నివేదిక సైతం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశంపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

ఇకపోతే సివిల్​ సప్లై విభాగంలో కేంద్రం నుంచి రావాల్సిన లెవీలో రూ.1,775 కోట్లు తమకు రావాలని ఏపీ డిమాండ్ చేస్తుండగా రూ.650 కోట్లే ఏపీకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు వివిధ పథకాల కింద ఇచ్చిన రూ. 1,621 కోట్లలో రూ.478 కోట్ల విదేశీ రుణాల్లో రెండు రాష్ట్రాల మధ్య వాటాలు సంగతి తేలాల్సి ఉంది. 

గోదావరి నీటిని కృష్ణా బేసిన్​కు తరలించి వరద నీటిని గరిష్టంగా వాడుకోవాలని రెండు రాష్ట్రాలు కొత్తప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. గోదావరి జలాలను శ్రీశైలం జలాశయానికి తరలించడం ద్వారా అటు రాయలసీమతో పాటు, తెలంగాణలోని మహబూబ్‌‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారు. 

రెండు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికి నీరందిస్తామని ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రకటించడం కూడా జరిగింది. దుమ్ముగూడెం టెయిల్​ పాండ్, ఇంద్రావతి దిగువన ఉన్న తుపాకుల గూడెం నుంచి నాగార్జునసాగర్​కు, అవసరమైతే శ్రీశైలం వరకు నీటిని మళ్లించే అంశాలపై ఇంజనీరింగ్​ నిపుణులతో అధ్యయనం చేయిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లలడించారు. 


కృష్ణా జల వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను తామే పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ సీఎంలు సూత్రపాయంగా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  బ్రిజేష్​ ట్రిబ్యునల్​తో సంబంధం లేకుండానే అవసరాల మేరకు నీటి వాటాలను ఇచ్చి పుచ్చుకోవాలని భావిస్తున్నాయి. గవర్నర్‌‌ నేతృత్వంలో రెండు రాష్ట్రాల సీఎస్​లు, జలవనరుల శాఖ కార్యదర్శులు ఈ మేరకు అవగాహన కుదుర్చుకునే అవకాశాలున్నాయి.

మెుత్తంమీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయితే జూలై 3న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసే అవకాశం ఉంది. 

ఇరు రాష్ట్రాల సీఎస్ లు గవర్నర్ సమక్షంలో సమావేశమై ఏకాభిప్రాయంతో సెటిల్ చేసుకున్న అంశాలపై నివేదికను గవర్నర్ నరసింహన్ కు అందజేయనున్నారు. ఆ తర్వాత గవర్నర్ నివేదికను కేంద్ర హోంశాఖకు పంపిచే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios