దళిత యువకుడిని బూటుకాలితో తన్నిన సీఐ... సస్పెండ్ చేసిన డీఐజీ (వీడియో)
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళిత యువకుడిపై దాడికి పాల్పడిన సీఐ వేణుగోపాల్ పై వేటు పడింది.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళిత యువకుడిపై దాడికి పాల్పడిన సీఐ వేణుగోపాల్ పై వేటు పడింది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన యువకున్ని సీఐ బూటుకాలితో తన్నిన వీడియో బయటకు రావడం...సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలాస మండలం టెక్కలిపట్నం కు చెందిన రమేష్, జగన్ అనే యువకులు గొడవపడ్డారు. దీంతో ఇద్దరూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే దళిత యువకుడైన జగన్ ను ఆయన తల్లి ఎదురుగానే సీఐ వేణుగోపాల్ బూటుకాలితో తన్నాడు.
వీడియో
"
సీఐ యువకుడిని తంతుండగా ఎవరో వీడియో తీశారు. దీన్ని వారు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏపీ డీజీపీ కార్యాలయం విచారణ చేపట్టింది. విశాఖ డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాలన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ''వైఎస్ జగన్ గారి పాలనలో దళితులకు జీవించే హక్కు లేదా?మాస్కు పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు.అక్రమ ఇసుక రవాణాకి అడ్డుపడ్డాడని వరప్రసాద్ కి శిరోముండనం చేసారు.ఇప్పుడు ఇళ్ల పట్టా అడిగినందుకు మర్రి జగన్ పై దాడికి దిగారు'' అని దళితులపై జరుగుతున్న దాడులపై ట్వీట్ చేశారు.
''శ్రీకాకుళంలో దళిత యువకుడిపై సిఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.ఇళ్లపట్టా అడిగినందుకు పలాస, టెక్కలిపట్నం గ్రామస్తుడు మర్రి జగన్ పై వైకాపా నాయకులు దాడి చేసారు.న్యాయం చెయ్యాలంటూ పోలీస్ స్టేషన్ కి వెళితే నడి రోడ్డుపై తల్లి ముందే బూటు కాలితో తన్ని చితకబాదాడు స్థానిక సిఐ. వైకాపా నాయకుల్లాగే ప్రజలని హింసిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.