జగన్కు ఆత్రం, ఆవేశం రెండూ ఎక్కువే: కన్నా సెటైర్లు
ఏపీ సీఎం జగన్ పై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు వేశారు. జగన్ కు ఆత్రం, ఆవేశం రెండూ ఎక్కువేనని ఆయన మండిపడ్డారు.
అమరావతి: జగన్ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామ స్థాయి నుండే తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నట్టుగా ఆయన ఆరోపించారు.
ఆదివారం నాడు అమరావతిలో జరిగిన బీజేపీ పదాదికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం కొంత కాలమైనా ఆగింది, కానీ, వైసీపీ సర్కార్ లో కనీసం ఒపిక కూడ లేదని ఆయన మండిపడ్డారు.
గ్రామస్థాయి నుండే ఉద్యోగాల తీసివేత పోలీసు కేసుల నమోదు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు జగన్ తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకొంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. జగన్ కు ఆత్రం, ఆవేశం రెండూ ఎక్కువేనని ఆయన సెటైర్లు వేశారు. ప్రభుత్వంలో వేగం లేదన్నారు.
వైఎస్ జగన్ సర్కార్ వేధింపులను నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన పల్నాడులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు.