విజయసాయి వ్యాఖ్యల వెనుక కుట్ర, విచారణ చేయాలి: కన్నా డిమాండ్
కోర్టుకు వెళ్లి అబద్దాలు చెప్పడంలో విజయసాయి రెడ్డి దిట్ట అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.నా సవాల్ కు ఒప్పుకొన్న వైసీపీ దానికి కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
గుంటూరు: కోర్టుకు వెళ్లి అబద్దాలు చెప్పడంలో విజయసాయి రెడ్డి దిట్ట అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.నా సవాల్ కు ఒప్పుకొన్న విజయసాయి రెడ్డి దానికి కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం నాడు సాయంత్రం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు.ఇవాళ ఉదయం విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు.
లాక్డౌన్ పూర్తైన తర్వాత కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు తేదీని నిర్ణయించనున్నట్టుగా ఆయన ప్రకటించారు.
విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కుట్రగా ఆయన అభిప్రాయపడ్డారు. తాను చేసిన డిమాండ్ ను వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా పార్టీకి చుట్టారన్నారు. పార్టీపై ఆరోపణలు చేయడమే కాకుండా ఇంకా దూరం తీసుకెళ్లారన్నారు. ఈ విషయమై విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన ప్రకటించారు.
ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే సంస్కృతి బీజేపీకి లేదని ఆయన చెప్పారు.కులం, కుటుంబం, అవినీతే వైసీపీ సిద్దాంతమని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఒక్క ఏడాదిలోనే వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందని చెప్పారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్స్ రేట్స్ విషయంలో పారదర్శకత నిరూపించుకోవాలని తాను ప్రభుత్వాన్ని కోరితే తనపై వ్యక్తిగత దూషణలకు దిగారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు దిగడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడ ఇదే తరహాలో విపక్షాలపై విమర్శలు చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.నేనేం మాట్లాడానో, వైసీపీ నేతలు ఏం మాట్లాడారో అనే విషయమై ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీని చూసి వైసీపీ, టీడీపీలు భయపడుతున్నాయన్నారు.
కరోనా పరీక్షల టెస్టింగ్ కిట్స్ విషయంలో పలువురు పలు రకాల ధరలను చెప్పిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ప్రస్తావించారు. ఈ విషయమై తాను మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం ధర విషయమై నోరు మెదిపిందన్నారు. టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో తప్పు చేసినందునే తనపై వ్యక్తిగత విమర్శలకు దిగారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
తాను లేవనెత్తిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆయన అభిప్రాయపడ్డారు. గుమ్మడి కాయల దొంగలు ఎవరంటే విజయసాయి రెడ్డి ఎందుకు భుజాలు తడుముకొంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
also read:కాణిపాకంలోనే ప్రమాణం, డేట్ నేనే చెబుతా: విజయసాయి సవాల్ కు కన్నా 'సై'
రాజధాని విశాఖలోనే వస్తోందని, దీన్ని ఎవరూ ఆపలేరని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ రాజధాని విశాఖకు వెళ్తుందో లేదా కాలమే నిర్ణయిస్తోందన్నారు. కరోనా కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం వాస్తవాలను దాచి పెడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.