సంక్రాంతి స్పెషల్... రూ.లక్షలు పలుకుతున్న పందేం కోళ్లు
కొన్ని రకాల బ్రీడ్ కోడి పుంజులు అయితే.. రూ.70వేల నుంచి రూ.1లక్ష వరకు ధర పలుకుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నారు. సంక్రాంతి అనగానే.. మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది.. భోగి మంటలు, ముగ్గులు, పిండివంటలు, కోడి పందాలు.ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని కోడి పుంజులు సమరానికి సై అంటూ కాళ్లు దువ్వుతున్నాయి.
కోడి పందేలు నిర్వహించరాదంటూ సుప్రీం కోర్టు ఆంక్షలు విధించినా.. గోదావరి జిల్లాల్లో మాత్రం బహిరంగంగానే జరుగుతూ ఉంటాయి. అయితే.. ఈ కోడి పందేలో బెట్టింగ్ రాయుళ్లు.. రూ.కోట్లలో బెట్టింగ్ లు కాస్తున్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్ లు పక్కన పెడితే.. పందేంలో పాల్గొనే పుంజుల ఖరీదు రూ.5వేల నుంచి రూ.25వేలకు వరకు ఉంటోంది.
ఇక కొన్ని రకాల బ్రీడ్ కోడి పుంజులు అయితే.. రూ.70వేల నుంచి రూ.1లక్ష వరకు ధర పలుకుతున్నాయి. ఈ పందేం కోళ్లలో 12రకాల బ్రీడ్స్ ఉన్నాయి. వాటిలో డేగ, కాకి, పతంగి, అస్లీ రకం కోడిపుంజులకు గిరాకీ ఎక్కువ. ఇవి రంగంలోకి దిగితే.. కచ్చితంగా గెలుస్తాయని నమ్మకం అందుకే.. వీటిని రూ.1లక్ష దాకా పెట్టి మరీ కొనుగోలు చేస్తుంటారు. వీటికి ఆాహారం కూడా నట్స్, జీడిపప్పు, బాదం, నాన్ వెజ్ వంటలు, పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే పెడతారు.
వీటికి రోజుకి రెండు సార్లు స్నానం చేయిస్తారు. స్విమ్మింగ్, ఎగరడం, ఫైట్ చేయడం లాంటివాటిలో శిక్షణ కూడా ఇస్తారు. ఈ పందేంలో ఓడిన కోడిపుంజును కోసుకొని తింటుంటారు.వీటి రుచి చాలా బాగుంటుందట. ఎందుకంటే.. వీటికి పెట్టే ఆహారం వల్ల వాటి రుచి అంత బాగుంటుందని చెబుతున్నారు. ఇక గెలిచిన కోడి మాంసానికి అయితే.. మార్కెట్లో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది.