జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి సవాల్ విసిరారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తనపై పోటీ చేస్తావో లేదో ఒక గంటలో చెప్పాలని డెడ్‌లైన్ విధించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మరోసారి సవాల్ విసిరారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ తన మీద పోటీ చేస్తారో లేదో గంటలో చెప్పాలని డెడ్ లైన్ విధించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్పు చేతుల్లో వున్న పార్టీ జనసేన అన్నారు. పవన్ కల్యాణ్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అంతకుముందు సోమవారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ.. సర్పవరం సెంటర్‌లో మీటింగ్ పెట్టారని.. అది తన నియోజకవర్గం పరిధిలోకి రాదని అన్నారు. పవన్ ప్రసంగంలో ఎక్కువ భాగం తన గురించే మాట్లాడారని అన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎవరిని ఉద్దరించడానికి పెట్టాడని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరూ కూడా పవన్‌తో లేరని అన్నారు. రాజా రవితేజ అనే వ్యక్తి జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి పవన్‌పైన విమర్శలు చేశారని చెప్పారు. కానీ చాలా ఏళ్లుగా తనతో ఉన్నవాళ్లు ఇప్పటికీ తనతోనే ఉన్నారని తెలిపారు. తాను మూడు సార్లు పోటీ చేస్తే.. రెండు సార్లు గెలిచానని అన్నారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. తనను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. పొలిటికల్‌గా పవన్ జీరో అని విమర్శించారు.

కాకినాడలో తనన ఓడించడం పవన్ వల్ల కాదని అన్నారు. తాను ఎవరి జోలికి వెళ్లనని.. తన జోలికి వస్తే మాత్రం ఊరుకోనని చెప్పారు. తాను ఏ రోజు అవమానాలు ఎదుర్కొలేదని అన్నారు. పవన్‌కు పరిటాల రవి గుండె కొట్టించారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని అతని కుటుంబంలోని కూతురు వరుసయ్యే అమ్మాయి ఫిర్యాదు చేసిందని అన్నారు. తాను కాకినాడలో పవన్ కల్యాణ్ బ్యానర్ కట్టనివ్వకూడదని అనకుంటే.. అస్సలు జనసేన బ్యానరే ఉండేది కాదని అన్నారు. తన కుటుంబం దొంగనోట్ల ముద్రించినట్టుగా నిరూపించాలని సవాలు విసిరారు. ఎవడో చెప్పిన మాటలు విని పవన్ కోతి గంతులు వేయడం మానుకోవాలని అన్నారు. తన దగ్గర రూ. 15 వేల కోట్లు ఉంటే.. తానే పవన్‌కు ప్యాకేజ్ ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. 

Also Read: పవన్ ఒక రాజకీయ వ్యభిచారి.. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయాలి.. : ద్వారంపూడి సవాలు..

కులాల ప్రస్తావన లేకుండా పవన్ కల్యాణ్ ప్రసంగం ఉండదని ద్వారంపూడి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఏపీ నుంచి తరిమిస్తే.. అన్ని కులాలు కలిసి ఉంటాయని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని విమర్శించారు. పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పవన్ ఇష్టమెచ్చినట్టుగా మాట్లాడితే.. తాము చేతల్లో చూపిస్తామని అన్నారు. పవన్ తన అన్న పేరు చెప్పుకొని వచ్చాడని.. కానీ తాము మెట్టు, మెట్టు ఎక్కి పైకి వచ్చామని చెప్పారు. పవన్ గురించి పూనమ్ కౌర్, రేణు దేశాయ్ మాట్లాడుతున్నారని.. అవసరమైతే తాము పవన్ కల్యాణ్‌ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతామని అన్నారు. 

పవన్ కల్యాణ్ చాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. జనసేన పార్టీ నుంచి తనపై పోటీ చేస్తే తుక్కు తుక్కుగా ఓడించకపోతే తన పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినే కాదని అన్నారు. పవన్ ఓడిపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని.. తాను ఓడిపోతే తాను తప్పుకుంటానని సవాలు విసిరారు. వేరే వాళ్లు పోటీకి వస్తే పవన్ కల్యాణ్‌ను పిరికివాడిగా భావించాల్సి ఉంటుందని చెప్పారు.