వివేకా హత్య కేసు .. ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ, ఫోన్ కాల్స్పై ఆరా
వైఎస్ వివేకా కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీసినట్లుగా సమాచారం.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విచారణకు హాజరుకావాలన్న కోర్ట్ ఆదేశాల మేరకు అవినాష్ హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయనను సీబీఐ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ప్రధానంగా వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీసినట్లుగా సమాచారం. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి తన నివాసానికి వెళ్లిపోయారు.
కాగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే గత నెలలో విచారణకు రావాల్సిందిగా సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయగా.. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టి.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ALso Read: కేసీఆర్ కు జగన్ ఝలక్ ఇవ్వడానికే.. అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి.. రఘురామ
ఈ సందర్భంగా పలు షరతులు కూడా విధించింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేసినట్లయితే రూ. 5లక్షల పూచీకత్తుతో బెయిల్పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉ. 10 నుంచి సా. 5గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని అవినాష్ను ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.