రూట్ మార్చిన కేఏపాల్: బాబుకు రిటైర్మెంట్ ఇద్దాం, కలిసి పనిచేద్దామంటూ జగన్ కు విజ్ఞప్తి
హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ తనకు తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కానీ శత్రువులు కారన్నారు. చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ ఇద్దాం, మనిద్దరం ప్రజల కోసం కలిసి పనిచేద్దామంటూ వైఎస్ జగన్ ను కేఏ పాల్ కోరారు.
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రూట్ మార్చారు. నిన్న మెున్నటి వరకు రా తమ్ముడు నిన్ను సీఎం చేస్తానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆఫర్లపై ఆఫర్లు ప్రకటించిన కేఏ పాల్ తీరా ఎన్నికల ముగిసిన తర్వాత తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగిన కేఏ పాల్ ఇప్పుడు స్నేహగీతం పాడుతున్నారు. స్నేహ హస్తం అందించాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ తనకు తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కానీ శత్రువులు కారన్నారు.
చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ ఇద్దాం, మనిద్దరం ప్రజల కోసం కలిసి పనిచేద్దామంటూ వైఎస్ జగన్ ను కేఏ పాల్ కోరారు. అంతేకాదు ఏపీలో సీఎం ఎవరనేది నిర్ణయించేది తానేనని చెప్పుకొచ్చారు. ఈనెల 23న ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు.
ఫలితాల తర్వాత ఏపీ ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది తానేనని పాల్ జోస్యం చెప్పారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. ఎన్నికల అనంతరం ఏపీలో తెలుగుదేశం పార్టీలో గెలిచే స్థానాలపై చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ఆ సర్వేలో ప్రజాశాంతి పార్టీకి 100కుపైగా స్థానాల్లో గెలుస్తుందని తెలిసిందన్నారు.
నీచ రాజకీయాలు చేయడం కంటే చిప్పలు పట్టుకొని అడుక్కోవడం బెటరన్నారు. కేఏ పాల్ నిజాయితీకి మారుపేరంటూ చెప్పుకొచ్చారు. కావాలనే తమకు హెలికాప్టర్ గుర్తు కేటాయించారంటూ విమర్శించారు. చంద్రబాబు మనసు మార్చుకుంటారా అని నిలదీశారు. మీ కోసం ప్రేయర్ చేయాలా అని చంద్రబాబును కేఏ పాల్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేను శపిస్తే.. నాశనం అయిపోతారు, కేటీఆర్ కి పాల్ వార్నింగ్