జగన్ ప్రభుత్వానికి జేపీ మార్కులు? దేనికి ఎన్ని వేశారంటే?
వైఎస్ జగన్ పాలనకు జయప్రకాష్ నారాయణ ఇచ్చిన మార్కులపై ఫన్నీ ట్రోల్స్ కొనసాగుతున్నాయి. చదువులో మాదిరిగానే పాలనలోనూ జగన్ ఫెయిల్ అయినట్లేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అమరావతి : మాజీ ఐఎఎస్, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ రాజకీయాలకు దూరంగా వుంటూ రాజకీయ విశ్లేషకులుగా మారిపోయారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయ పరిస్థితులను ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నేటి రాజకీయాలు, పరిపాలనపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు జెపి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ జేపి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ తెలుగు టీవి ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ పాలనకు జయప్రకాష్ నారాయణ మార్కులు ఇచ్చారు. ఈ వీడియోను పట్టుకుని నెటిజన్లు వైసిపి సర్కార్, జగన్ పాలనను ట్రోల్ చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో విద్యా వ్యవస్థకు కేవలం 2 మార్కులే (మొత్తం 5 మార్కులకు గాను) ఇచ్చారు జయప్రకాష్ నారాయణ. అలాగే వైద్య వ్యవస్థకు 2 మార్కులు, వాలంటీర్ వ్యవస్థకు 1 మార్కు ఇచ్చారు. 2019 నుండి 2024 వరకు అంటే గత ఐదేళ్లలో ఏపీలో జగన్ సర్కార్ పాలనకు కేవలం 1 నుండి 2 మార్కులు ఇచ్చారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ది అధ్వాన్నంగా వుందంటూ కేవలం 1 మార్కు ఇచ్చారు. మహిళా సాధికారతకు 2,హెల్త్ కేర్ కు 2, పెట్టబడుల ఆకర్షనకు 1 మార్కు ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలన విషయంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయ్యిందంటూ కేవలం ఒకే ఒక మార్కు ఇచ్చారు జెపి.
ఇలా జగన్ పాలనకు జయప్రకాష్ నారాయణ ఇచ్చిన మార్కుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఏంది సార్... అసలు మీ దగ్గర ఎక్కువ మార్కుల బోర్డు లేదా' అంటూ కొందరు... 'వైఎస్ జగన్ చదువులాగే పాలన కూడా వుంది... పాలనలోనూ అత్తెసరు మార్కులే' అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఎన్నికల వేళ జేపి మార్కుల వీడియో జగన్ పార్టీని ఇరకాటంలో పెడుతోంది.
అయితే వైఎస్ జగన్ పాలనలో కొన్ని విషయాలు అద్భుతంగా వున్నాయని కూడా జయప్రకాష్ నారాయణ కొనియాడారు. ముఖ్యంగా ప్రజా సంక్షేమం విషయంలో జగన్ సర్కార్ చాలా నిబద్దతతో వుందని... ఈ విషయంలో 4 మార్కులు వేయవచ్చని అన్నారు. అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలను ఇస్తోందంటూ 3 మార్కులు ఇచ్చారు. హెల్త్ కేర్ అంత గొప్పగా లేదంటూనే ఇటీవల తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ విధానానికి 2 లేదా 3 మార్కులు వేయవచ్చని జెపి అభిప్రాయపడ్డారు.
మరోవైపు 2014 నుండి 19 వరకు ఆంధ్ర ప్రదేశ్ లో సాగిన చంద్రబాబు పాలనపైనా జెపి స్పందించారు. వైఎస్ జగన్ తో పోలిస్తే చంద్రబాబు పాలనకు మంచిమార్కులే వేసారు జెపి. చాలా ప్రతికూల పరిస్థితుల్లో పాలనా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు సమర్ధవంతంగా పనిచేసారని... ఆర్థిక జాగ్రత్తలు పాటిస్తూనే పెట్టుబడులను ఆకర్షించడం, మౌళిక సదుపాయాలు కల్పించడం చేసారన్నారు. కాబట్టి చంద్రబాబు పాలనకు 3 మార్కులు ఇస్తున్నట్లు జేపి తెలిపారు. చట్టబద్ద పాలన లేకపోవడం, అధికార వికేంద్రీకరణ గురించి ఆలోచించకపోవడం, అవినీతిని అరికట్టలేకపోవడం చంద్రబాబు పాలన ఫెయిల్యూర్ గా జేపి పేర్కొన్నారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఏషియాా నెట్ సర్వేలో పాల్గొనండి https://telugu.asianetnews.com/mood-of-andhra-survey
ఇక తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థపై జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇరు రాష్ట్రాల్లోని 14-18 ఏళ్ల వయసులోని 40 నుండి 50 శాతం యువత కనీసం గడియారం చూసి టైమ్ చెప్పలేని పరిస్థితి వుందన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం విద్యావ్యవస్థకు అంత ఖర్చుచేసాం, ఇంత ఖర్చుచేసాం అని చెప్పుకుంటున్నాయన్నారు. నేటి విద్యావ్యవస్థ మేధస్సును పెంచడంలో విఫలం అవుతోందని... మన దేశంలో చాలా అధ్వాన్నంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ వుందన్నారు.
ఎన్నికల వ్యవస్థపైనా జెపి ఘాటు వ్యాఖ్యలు చేసారు. అవినీతి నిర్మూలన, చట్టబద్ద పాలన, అధికా వికేంద్రకరణ, ఎన్నికల విధానాన్ని మార్చడానికి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంకల్పం లేదన్నారు. నాయకులుగా నవీన్ పట్నాయక్, యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోదీ నికార్సయిన నిజాయితీపరులు... కానీ వారి నేతృత్వంలోని మార్పు సాధ్యంకావడంలేదని అన్నారు. ఉత్తర ప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో అద్భుత పాలన సాగుతోందని... ఈ రాష్ట్రాల్లో రెవెన్యూ మిగులు వుందని జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు.