వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్
పీపీఏల రద్దు విషయంలో జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. ఈ నిర్ణయాన్ని జపాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం ఏపీకి లేఖ రాసింది.
అమరావతి:రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్ ల విషయంలో జపాన్ ప్రభుత్వం ఏపీ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాసింది. పీపీఏల ఒప్పందాలను సమీక్షించడాన్ని జపాన్ సర్కార్ తప్పుబట్టింది. ఏపీ సర్కార్ నిర్ణయాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్టుగా జపాన్ సర్కార్ స్పష్టం చేసింది.
జపాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అంశంపై ఏపీ సీఎం జగన్ కు జపాన్ అంబాసిడర్ లేఖ రాశారు. ఏపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయాల వల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొంటుందని జపాన్ అంబాసిడర్ అభిప్రాయపడ్డారు.
ఇండియా రెన్యూవబుల్ సెక్టార్ లో విదేశీ పెట్టుబడులు భారీగా వస్తున్న తరుణంలో జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్,దక్షిణాఫ్రికా, యూరప్ కంపెనీలు టెండర్లలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే జపాన్ కంపెనీలు పలు ఒప్పందాలు చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.
పీపీఏల రద్దు విషయంలో ఇప్పటికే టీడీపీ తప్పు బట్టింది. కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి కూడ ఈ విషయాన్ని తప్పుబడుతూ ఏపీ రాష్ట్రానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని జగన్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడ ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఏపీ రాష్ట్రానికి పలు సంస్థల నుండి కూడ లేఖలు వచ్చినట్టుగా చెబుతున్నారు.పీపీఏల రద్దు విషయంలో పలు కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి.