రావెల జంపింగ్ ఎఫెక్ట్: జనసేన పార్టీ ఆఫీస్ కి టూలెట్ బోర్డు
రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరడంతో ప్రత్తిపాడులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు కార్యకర్తలు. పార్టీ లోగోలు గానీ పార్టీ అధినేత చిత్రాలను గానీ తొలగించకుండానే యజమానికి భవనాన్ని తిరిగి అప్పగించారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జనసేన పార్టీకి షాక్ ఇచ్చాయి. ప్రజాతీర్పుతో కోలుకోలేని దెబ్బతిన్న కొందరు అభ్యర్థులు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసి వేర్వేరు పార్టీల్లో చేరిపోయిన సంగతి తెలిసిందే.
నాయకులు పార్టీల్లోకి జంప్ అవుతుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు సైతం మూతపడిపోతున్నాయి. తాజాగా మాజీమంత్రి రావెల కిషోర్ బాబు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరడంతో జనసేన పార్టీ కార్యాలయం బోసిపోయింది.
నిర్వహణ బాధ్యతలు ఎవరూ తీసుకోకపోవడంతో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు. దాంతో ఆ పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టేశారు ఓనర్. అయితే ఓ కండీషన్ కూడా పెట్టారు ఆఫీస్ లేదా బార్ అండ్ రెస్టారెంట్ కు అయితే ఇస్తానని చెప్పుకొచ్చారు.
ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు రావెల కిషోర్ బాబు. రావెల కిషోర్ బాబుకు ప్రత్తిపాడు టికెట్ కన్ఫమ్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. దాంతో రావెల కిషోర్ బాబు గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో జనసేన పార్టీని ఏర్పాటు చేశారు.
రావెల కిషోర్ బాబు బీజేపీలో చేరడంతో ప్రత్తిపాడులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేశారు కార్యకర్తలు. పార్టీ లోగోలు గానీ పార్టీ అధినేత చిత్రాలను గానీ తొలగించకుండానే యజమానికి భవనాన్ని తిరిగి అప్పగించారు.
అయితే భవన యజమాని వాటిని తొలగించకుండానే టూలెట్ బోర్డు ఏర్పాటు చేశాడు. ఆఫీస్ లేదా బార్ అండ్ రెస్టారెంట్కు అద్దెకు ఇస్తానని అందులో స్పష్టం చేశాడు. ఇకపోతే ఈ కార్యాలయాన్ని తీసుకుని ఆరు నెలలు అయ్యింది. సంవత్సరం తిరక్కుండానే పార్టీ కార్యాలయం మూతపడిపోవడం విశేషం.