పొత్తులు ఎవరితో అనేది పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు.. అవన్నీ కలిస్తేనే వైసీపీ: జనసేన నేత నాగబాబు
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీపై జనసేన నేత నాగబాబు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఓ పార్టీనా..? అంటూ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీపై జనసేన నేత నాగబాబు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ఓ పార్టీనా..? అంటూ మండిపడ్డారు. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అని విమర్శించారు. కర్నూలులో పర్యటిస్తున్న నాగబాబు మీడియాతో మాట్లాడారు. జనసైనికులు, వీర మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు కర్నూలు వచ్చినట్టుగా చెప్పారు. జనసేన పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు. ఇంకా ఏం రాకముందే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని అన్నారు. పొత్తుల తర్వాత ఎవరు.. ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయం ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉంటే శుక్రవారం కర్నూలుకు చేరుకున్న నాగబాబుకు జనసేన శ్రేణులు స్వాగతం పలికాయి. సాయంత్రం నాగబాబను సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన నాగబాబు.. జనసేన అధికారంలోకి రాగానే పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతి కేసుపై దృష్టి పెడతారని తెలిపారు.
ఇక, శనివారం ఉదయం కర్నూలులో జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో వీర మహిళలు, జన సైనికులతో నాగబాబు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం నాగబాబు అనంతపురం చేరుకోనున్నారు.