భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి జగన్ బుధవారం హెలికాఫ్టర్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాస, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు నిలిపివేశారు . ఈ వ్యవహారంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం, పోలీసులపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం హెలికాఫ్టర్లో వెళ్తుంటే.. హైవేపై వాహనాలను ఆపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడానికి జగన్ బుధవారం హెలికాఫ్టర్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాస, అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు నిలిపివేశారు. గంటల తరబడి వాహనాలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ గాల్లో ప్రయాణిస్తుంటేప.. రహదారిపై వాహనాలు ఏ విధంగా అడ్డుగా వుంటాయని ప్రశ్నించారు. రోడ్డు మీదకు వస్తే పరదాలు కట్టించుకోవడం, దుకాణాలు మూసివపేయడం లాంటి చర్యలను బట్టి రోజురోజుకు సీఎం జగన్కు ఆభద్రతా భావం పెరిగిపోతోందని నాదెండ్ల చురకలంటించారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల భోగాపురానికి అటూ ఇటూ 150 కి.మీ దూరంలో వున్న హైవేపై వాహనాలను నిలిపివేశారని.. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాని మనోహర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జనసేన నేతలను అదుపులోకి తీసుకోవడం అప్రజాస్వామికమన్నారు.
Also Read: ప్రజల ఆశీస్సులున్నంతవరకు ఏమీ చేయలేరు: భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన
అంతకుముందు భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసిన అనంతరం జగన్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పనిచేయవన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 98.5 శాతం అమలు చేసినట్టుగా జగన్ చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందునే మీ ముందుకు వచ్చి అడిగే అర్హత తమకే ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. ఏ మంచి చేయని చంద్రబాబుకు దుష్టచతుష్టయం మద్దతు ఇస్తుందని జగన్ విమర్శించారు. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్తపుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడని ఆయన పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.
ఓ వైపు పేదవాడి ప్రభుత్వం, మరోవైపు పెత్తందారుడికి మద్దతు తెలిపే పార్టీలున్నాయన్నారు. పేదవాడికి ఇంగ్లీష్ చదువు అందిస్తున్న తాము ఒక వైపు, పేదలకు ఇంగ్లీష్ చదువులు వద్దని భావించే వర్గం మరో వైపు ఉందని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి మధ్య తేడాను చూడాలని ఏపీ సీఎం జగన్ ప్రజలను కోరారు. తమ ప్రభుత్వంలో మంచి జరిగిందని భావిస్తేనే తనను ఆశీర్వదించాలని జగన్ ప్రజలను కోరారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటేసిన వారి ఇంటికి వెళ్లి సైతం తాము ఇదే విషయాన్ని అడగగలమన్నారు. సీఎంగా ఉన్న కాలంలో ఏం చేశారో చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖపట్టణం అందరికీ ఆమోదయోగ్యమైన నగరమని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుండి విశాఖ నుండి పాలనను ప్రారంభించనున్నట్టుగా తెలిపారు.
