గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసం చేపట్టిన ఇళ్ల కూల్చివేతల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను వేడెక్కించింది. ఈ నేపథ్యంలో రేపు ఇప్పటానికి రానున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 

గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలు ఆగిపోయాయి. కూల్చివేతలు నిలిపివేయాలంటూ జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే రోడ్డుకు ఒకవైపున కూల్చివేతలు పూర్తయ్యాయి. అయితే కోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేతలను నిలిపివేశారు అధికారులు. మరోవైపు కూల్చివేతల నేపథ్యంలో ఇప్పటంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ప్రధాన రోడ్డును 120 అడుగుల వరకు విస్తరిస్తున్నారు అధికారులు. ఇందుకోసం రోడ్డుకు ఇరువైపులా వున్న ఇళ్లను తొలగిస్తున్నారు. దీనిని వ్యతిరేకించారు గ్రామస్తులు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చిన్న గ్రామంలో పెద్ద రోడ్లు వేయడంతో ఇళ్లను కోల్పోతున్నామని బాధితులు .. అధికారులతో వాగ్వాదానికి దిగారు. జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇచ్చినప్పటి నుంచి అధికారులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిరసన వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ALso REad:మనోడు కాకపోతే తొక్కి నార తీయడమే... జగన్ పాలనలో ఇదే : ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై పవన్

ఇకపోతే.. రేపు ఇప్పటం గ్రామానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. రాత్రికి మంగళగిరి వెళ్లబోతున్నారు. రేపు ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించనున్నారు పవన్. అంతకుముందు ఇళ్ల కూల్చివేతపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. వాళ్లకు ఓటేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వ తీరు వుందని.. మనవారు కానివారిని తొక్కి నార తీయండి అనేలా ఏపీలో పాలన సాగుతోందని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణ వంకతో ఇళ్లు తొలగిస్తున్నారని.. కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారని ఆయన గుర్తుచేశారు. ఆగమేఘాల మీద ఇళ్ల కూల్చివేత చేపట్టారని.. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో జరుగుతోంది అరాచకమేనని పవన్ దుయ్యబట్టారు. ఇప్పటికే 70 అడుగుల రోడ్డు వుంటే ఇంకా విస్తరణేంటీ అని ఆయన ప్రశ్నించారు.