నాపై కేసులు పెడతామంటున్నారని.. పెట్టుకో జగన్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం, మీరు కౌరవులని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పానని ఆయన తెలిపారు.
నాపై కేసులు పెడతామంటున్నారని.. పెట్టుకో జగన్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఓడిపోవడం ఖాయం.. మేము అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో జరిగిన వారాహి విజయయాత్ర బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమేనన్నారు. 2018 నుంచి ఉద్యోగాలు లేవని.. పాదయాత్రలో ఇవ్వని హామీలు లేవని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. 2018 నుంచి డీఎస్సీ ప్రకటన రాలేదని.. డీఎస్సీ కోచింగ్కు అవనిగడ్డ ప్రధాన కేంద్రమన్నారు. ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. కురుక్షేత్ర యుద్ధంలో మేం పాండవులం, మీరు కౌరవులని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ తాము అండగా వుంటామని ఆయన హామీ ఇచ్చారు. 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా వున్నాయని పవన్ తెలిపారు. డీఎస్సీ వేస్తామని జగన్ హామీ ఇచ్చారని.. పోలీస్ ఉద్యోగి కష్టనష్టాలు తనకు బాగా తెలుసునని జనసేనానని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటామని.. ఈ పదేళ్లలో జనసేన పార్టీ అనేక దెబ్బలు తిందని పవన్ చెప్పారు. ఆశయాలు, విలువల కోసం తాము పార్టీని నడుపుతున్నామని ఆయన తెలిపారు. యువత భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ అనుకుంటానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అధికారం కోసం అర్రులు చాచనని.. తనకు చాలా బెదిరింపులు వచ్చాయని, కదన రంగం నుంచి పారిపొమ్మన్నారని ఆయన తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటు చీలకూడదని అంటున్నానని.. మనం, మన పార్టీల కంటే ఈ రాష్ట్ర నేల చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర యువత, ఎంతో విలువైన దశాబ్ధ కాలం కోల్పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ అభ్యర్ధుల నియామక ప్రక్రియలో అనేక ఇబ్బందులు వున్నాయని పవన్ చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఓట్లు చీలనివ్వనని చెప్పానని ఆయన తెలిపారు.
వైసీపీ ప్రభుత్వాన్ని కిందకు దించడమే మా లక్ష్యమని.. ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన ప్రభుత్వమే వస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎందరికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే అభివృద్ధి ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. జగన్ అద్బుతమైన పాలకుడైతే నాకు రోడ్డుపైకి వచ్చే అవసరం లేదన్నారు. ఈ దేశ ప్రధానికి జగన్ గురించి తెలియదా.. ఆయన వేల కోట్ల అవినీతి చేసినట్లు రుజువైందని పవన్ తెలిపారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని ఆయన వెల్లడించారు.
సమాఖ్య స్పూర్తి కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలి కదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అధికార మదం వున్న వైసీపీ నేతలను ఎలా ఎదర్కోవాలో నాకు తెలుసునని ఆయన స్పష్టం చేశారు. మూడు తరాలుగా రాజకీయాలు చేసే వ్యక్తితో పోరాటం చేస్తున్నానని పవన్ చెప్పారు. సమాఖ్య స్పూర్తి కోసం ఎన్నికైన ప్రభుత్వాన్ని గౌరవించాలి కదా అని జనసేనాని అన్నారు. డబ్బు మీద, నేల మీద తనకు ఎప్పుడూ కోరిక లేదని.. డబ్బుకు అమ్ముడుపోయానని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నైతిక బలంతోనే ఎంతో బలమైన జగన్తో గొడవ పెట్టుకుంటున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని పవన్ తేల్చిచెప్పారు. వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని.. ఓట్లు కొనేందుకు తన దగ్గర డబ్బు లేదన్నారు. బైజూస్ను బత్తాయి జ్యూస్లా పిండేశారని.. వైసీపీ హయాంలో 3.88 లక్షల మంది విద్యార్ధులు డ్రాప్ఔట్ అయ్యారని పవన్ తెలిపారు. మీరు చేసిన గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వేలమంది పిల్లలు ఎందుకు చనిపోయారో శ్వేతపత్రం ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
ఇసుక దోపిడీ, అవినీతి గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్దామని అనుకున్నానని ఆయన చెప్పారు. యువతకు అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానని హామీ ఇస్తున్నానని పవన్ తెలిపారు. 20 ఏళ్లు దాటాక సొంతకాళ్లపై నిలబడాలని యువత కోరుకుంటారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగి కష్టం తనకు బాగా తెలుసునని.. తాను ఎలాంటి వాడినో పదేళ్లుగా మీరు చూస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఉద్యోగం రానివారికి నిరుద్యోగ భృతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లాల్లో 86 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు వున్నాయని పవన్ తెలిపారు. కృష్ణా జిల్లా ప్రజలకు ఇంటింటికీ తాగునీరు ఇస్తామని.. జీవితంలో కింద నుంచి వచ్చిన వారికి ఆత్మగౌరవం వుంటుందని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి వున్నవారు రాజకీయ నాయకులైతే ఎలా వుంటుందో చూపిస్తామని పవన్ చెప్పారు. అవనిగడ్డలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసం ప్రధానితో , ప్రత్యేక ప్యాకేజ్ ఎలా తీసుకుంటారని చంద్రబాబుతో విభేదించానని ఆయన గుర్తుచేశారు. తాను అసెంబ్లీలో వుంటే పరిస్ధితి వేరుగా వుండేదని.. తాను ఎక్కడికీ పారిపోను, ఇక్కడే వుంటానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి సరైన వ్యక్తులను గెలిపించుకుకోకుంటే ఓ తరం నష్టపోతుందని ఆయన హెచ్చరించారు. జగన్.. ముద్దూమురిపాలతో పదేళ్లు జనంలో తిరిగారని పవన్ చురకలంటించారు. ప్రజలు జగన్ను దేవుడని మొక్కారని, ఆయన దయ్యమై పీడిస్తున్నారని ఎద్దేవా చేశారు.