కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడని, పీకలదాకా తాగి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం కాకినాడలో ఆయన ప్రసంగిస్తూ.. కోన్‌కిస్కా గాళ్లంటే తనకు భయం లేదన్నారు. 2019లో వైసీపీ గెలిచినప్పుడు ద్వారంపూడి పీకలదాకా మందు తాగి, మద్యం మత్తులో తనను బూతులు తిట్టాడని పవన్ ఆరోపించారు. కాకినాడ ఎమ్మెల్యేకి ఒళ్లు తిమ్మిరిగా వుందని, నోటిదూల ఎక్కువైందన్నారు. ద్వారంపూడి తాతలు, తండ్రులు వూళ్లో పెద్ద రౌడీలని.. వాళ్ల ఫ్యామిలీ బియ్యాన్ని దొంగ రవాణా చేస్తారని పవన్ వ్యాఖ్యానించారు. దొంగ నోట్లు ముద్రించేవాళ్లని.. వాళ్లని అప్పటి ఎస్పీ డీటీ నాయక్ సంకెళ్లు వేసి జీపు వెనుక నడిపించాడని జనసేనాని చురకలంటించారు. 

తనను నానా మాటలు అన్నా తనకు బాధలేదని.. కానీ జనసేన కార్యకర్తలు, వీర మహిళలపై రాళ్లు దాడి చేయించినందుకు తనకు విపరీతమైన కోపం వచ్చిందన్నారు. వారిని పరామర్శించేందుకు తాను తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంటే 144 సెక్షన్ పెట్టారని పవన్ గుర్తుచేశారు. పంతం నానాజీ, సందీప్ పంచకర్లకు తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. తనకు అన్ని గుర్తున్నాయని.. ఈ డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించే బాధ్యతను తాను తీసుకుంటానని జనసేనాని వెల్లడించారు. 

క్రిమినల్స్ రాజ్యాలు ఏలితే తనకు నచ్చదని.. పాలించేవాడు క్రిమినల్ అయితే ఏం చేయాలని పవన్ ప్రశ్నించారు. ద్వారంపూడిపై జనవాణిలో ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని జనసేనాని వెల్లడించారు. 2009 నుంచి రాజకీయాల్లో కొనసాగి వుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చేదికాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సినిమాల్లో బిజీ కావడం వల్ల కాస్త లేట్ అయ్యిందని.. తాను ఏం మాట్లాడినా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారన్న అహంకారంతో .. ద్వారంపూడి తనను బూతులు తిట్టాడని పవన్ ఫైర్ అయ్యారు. క్రిమినల్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అండగా వుంటున్నారని ఆయన ఆరోపించారు. 

ఆ రోజున తనకొచ్చిన కోపానికి నోరు విప్పుంటే ద్వారంపూడి వుండేవాడు కాదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తల మీద దాడి చేయించినందుకు ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలనుకున్నానని ఆయన తెలిపారు. అయినప్పటికీ.. ఒక క్రిమినల్ సీఎం అయితే ఏం చేయాలని పవన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి వీళ్లు సరైన వాళ్లు కాదని 2014 ముందే చెప్పానని ఆయన గుర్తుచేశారు. వైసీపీ పాలనలో రౌడీయిజం, గుండా, దోపిడీ, లూటీ, కబ్జా నిత్యకృత్యమయ్యాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కానీ ఏదో ఒకరోజు బాధ్యతగల తన లాంటి దేశభక్తుడు ఎదురు తిరుగుతాడని హెచ్చరించారు. వైసీపీ నాయకులు సమాజాన్ని కులాల పరంగా విభజిస్తారని.. ఒక కులం ఎక్కువ, మరొకటి తక్కువ అని తాను ఏనాడు భావించలేన్నారు.