ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడి చేసిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడి చేసిన వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక ప్రకటన చేశారు. పంచారామాల్లో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికీ, దాష్టీకానికి ప్రతీక అని విమర్శించారు. ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్‌పై వైసీపీ నాయకుడైన ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త శ్రీ యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి, పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచేశారో ఆ పరమేశ్వరుడికే తెలియాలని కామెంట్ చేశారు. 

‘‘వైదిక ఆచారాల్లో యజ్ఞోపవీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తాం. వేదాలు చదివి భగవంతుని సేవలో ఉండే అర్చకులపై దాడి చేయడం, వారిని ఇబ్బందిపెట్టడం రాక్షసత్వమే. ప్రశాంతంగా పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగాణాల్లో అహంకారం, అధికార దర్పం చూపడం క్షమార్హం కాదు. అన్నవరంలో పురోహితులను వేలం వేయాలని ఒక అర్థం లేని నిర్ణయం తీసుకున్నారు. జనసేన తీవ్రంగా వ్యతిరేకించేసరికి వెనక్కి తగ్గారు. ఇప్పుడు పంచారామ క్షేత్రంలో అర్చకుడిపై దాడికి తెగబడ్డారు. వైసీపీ సర్కార్ హిందూ ఆలయాలు, ఆస్తులపై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించే క్రమంలోనే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది. ఇది స్థానిక వైసీపీ నాయకుడు చేసిన దాడిగా సరిపుచ్చలేం. 

యథా నాయకుడు - తథా అనుచరుడు అనే విధంగా తయారయ్యారు వైసీపీ నాయకులు. ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి చేసి, పవిత్ర యజ్ఞోపవీతాన్ని తెంచేశారో ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఈశ్వరుని సన్నిధిలో దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనతోపాటు రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ వైఖరి గురించి, ఆలయాలపై దాడులు గురించి కేంద్రానికి నివేదిక అందిస్తాం’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.