సారాంశం
వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. తాజాగా మరో అంశంతో వైసీపీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. తాజాగా మరో అంశంతో వైసీపీ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు బైజాస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. యాప్స్ అనేది చాయిస్ అని, టీచర్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా బైజూస్ కంపెనీ నష్టాల్లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.
నష్టాలు వచ్చే స్టార్టప్కి కోట్లలో కాంట్రాక్టులు ఇస్తున్నారని వైసీపీ సర్కార్పై పవన్ విమర్శలు గుప్పించారు. ఈ కాంట్రాక్టుకు సంబంధించి టెండరింగ్ ప్రక్రియపై కూడా ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. తన ప్రశ్నలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా రంగంలో నెలకొన్న సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు.
‘‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు, టీచర్ రిక్రూట్మెంట్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు. కానీ నష్టాలు వచ్చే స్టార్టప్కి కోట్లలో కాంట్రాక్టు వస్తుంది. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ను పాటించిందా? టెండర్ కోసం ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి, ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు? ఇది పబ్లిక్ డొమైన్లో ఉందా? వైసీపీ ప్రభుత్వం స్పందించాలి’’ అని పవన్ పేర్కొన్నారు. ట్యాబ్లు మంచివేనని.. అయితే ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలని వైసీపీ సర్కార్ను ఎద్దేవా చేశారు. యాప్స్ అనేది చాయిస్ అని, టీచర్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలని పవన్ అన్నారు. ఇక, బైజూస్ కంపెనీ నష్టాల్లో ఉన్నట్టుగా చెబుతున్న పలు మీడియా కథనాలను కూడా పవన్ కల్యాణ్ తన ట్వీట్లో పొందుపరిచారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ను, ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఈ ట్వీట్లో ట్యాగ్ చేశారు.