పవన్ అక్కడి నుంచే పోటీ చేయనున్నారా? రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్..!
Kakinada: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే, జనసేన అధినేత పవన్ అడుగులు ఎటువైపు, ఎక్కడి నుంచి పోటీ అనేది హాట్ టాపిక్ గా మారింది.
Jana Sena chief Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్ర రాజకీయాలు కొత్త మలుపుతు తీసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీసీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు ఇప్పటికే గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, రానున్న ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషించనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి కూడా రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా? ప్రస్తుతం ఈ ప్రశ్న జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు కాకినాడలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ మొదటి రోజు రెండు గంటల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించారని, ఆ తర్వాత దాదాపు రెండు రోజుల పాటు కాకినాడ నగరంపై దృష్టి పెట్టారని విశ్వసనీయ సమాచారం. అయితే, పవన్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా? లేదా? అనేదానిపై పార్టీ నుంచి గానీ, ఆ పార్టీ అగ్ర నాయకుల నుంచి గానీ స్పష్టత రాకపోవడంతో ఇప్పుడు ఇదే అంశం సొంత పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కాకినాడ సిటీ నుంచి జనసేన పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని ఓడించాలని పవన్ కృతనిశ్చయంతో ఉన్నారని సమాచారం.
గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం కాకినాడ సిటీలో ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. మధ్యలో మిగతా నియోజకవర్గాల పరిస్థితిని సమీక్షించినప్పటికీ కాకినాడ సిటీపై ఎక్కువ ఫోకస్ పెట్టారని జనసేన నేతలు భావిస్తున్నారు. నగరంలోని 50 డివిజన్ల జనసేన నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో నేతల పనితీరు, బూత్ స్థాయిలో యంత్రాంగాన్ని సమీక్షిస్తున్నారు. కొన్ని డివిజన్లలో పార్టీకి కమిటీలు లేవని ఆయన దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
వెంటనే కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని సంబంధిత నేతలను ఆదేశించారని తెలిసింది. కాకినాడ నుంచి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గెలవలేరని పవన్ వారాహి యాత్రలో వార్నింగ్ ఇచ్చారు. మరుసటి రోజు ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకినాడ పార్లమెంట్ లో జనసేన ఎక్కువ సీట్లు గెలవాలని ఆయన శుక్రవారం పార్టీ నేతలతో చెప్పినట్లు చెబుతున్నారు. శనివారం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల పరిధిలోని కొన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతో సమీక్ష నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.