రైతులను వేధిస్తే  వైసీపీ సర్కార్  తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని  పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 

రాజమండ్రి: తనకు సమస్యలు చెప్పుకున్న రైతులపై అధికారులు, అధికార పార్టీ నేతలు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు దుశ్చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారంనాడు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రైతులు తమ సమస్యలను జనసేనకు చెప్పుకున్నారని కక్ష కట్టవద్దని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన చేస్తే కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అన్నం పెట్టిన రైతును వేధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కరించాలని వైసీపీ సర్కార్ ను ఆయన కోరారు. ఏపీలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని కారణంగా అకాల వర్షాలకు ధాన్యం తడిసిందని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలకు సీఎం క్షేత్రస్థాయిలో వాస్తవ నివేదకలు పరిశీలించలేదన్నారు. 

రైతులను పట్టించుకోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం లేదన్నారు. 

తాము పర్యటన చేస్తున్నామని తెలిసి అధికారులు హడావుడిగా గోనెసంచులు ఏర్పాటు చేశారన్నారు. ఏదైానా ఒత్తిడి ఉంటే కానీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఏపీ వ్యవసాయ అధారిత రాష్ట్రంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు వరికి ధాన్యాగారంగా ఉన్నాయన్నారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారు. 

వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు సరిగా పనిచేయకపోవడం వంటి కారణాలు కూడా రాష్ట్రంలో రైతుల ఇబ్బందులకు కారణమయ్యాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రతి పంటకు పావలా వడ్డీకి పంట రుణం ఇప్పించాలని రైతులు కోరుతున్నారన్నారు.పావలా వడ్డీకి రుణాలిస్తే తమకు పంట రుణమాఫీ కూడా అవసరం లేదని రైతులు చెబుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల సమస్యలు వినేందుకు జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. రైతులకు సకాలంలో ఖాతాల్లో డబ్బులు వేయడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు.