Asianet News TeluguAsianet News Telugu

సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా... జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేదం దిశగా సంచలన నిర్ణయం తీసుకుంది. 

jagans govt sensational decision on alcohal ban
Author
Amaravathi, First Published May 9, 2020, 9:01 PM IST

అమరావతి: రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్న ప్రభుత్వం తాజాగా  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో 33 శాతం దుకాణాలను రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగానే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేస్తున్నారని తెలిపారు. 

రాష్ట్రంలో మొత్తం మద్యం షాపుల్లో  33 శాతం మద్యం షాపులు తొలగిస్తూ ప్రభుత్వం శనివారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సంపూర్ణ మద్య నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆదాయం కంటే ప్రజాహితానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పుష్ప శ్రీవాణి స్పష్టం చేసారు. 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి మద్యం షాపులు, బార్ల సంఖ్యను భారీగా పెంచడంతో పాటుగా, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం బెల్టు షాపులను టీడీపీ నేతలు తమ ఆదాయవనరుగా మార్చుకున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో ఏరులైపారిన మద్యం కారణంగా అనేక మంది పేదల జీవితాలు చిన్నాభిన్నమైయ్యాయని, ఈ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధాన్ని తీసుకొస్తామని తన పాదయాత్రలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 

ఎన్నికల హామీని నెరవేర్చడంలో భాగంగానే గతంలోనే 20 శాతం షాపులు తొలగించిన ప్రభుత్వం తాజాగా మరో 13 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్య 4380 నుంచి 2934 తగ్గుతుందని తెలిపారు. కొత్తగా తొలగించాలని నిర్ణయించిన మద్యం దుకాణాలను ఈ నెలాఖరు నాటికి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. 

అలాగే రాష్ట్రంలో ఉన్న 40 శాతం బార్లు తగ్గిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకొని, వాటిని రద్దు చేయడంతో పాటుగా మద్యం షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్ లను కూడా ప్రభుత్వం ఇదివరకే పూర్తిగా తొలగించిందని గుర్తు చేసారు. అధికారికంగా ఉండే మద్యం దుకాణాలు, బార్లు మాత్రమే కాకుండా గత ప్రభుత్వం హయాంలో పెంచి పోషించిన 43 వేల అక్రమ బెల్టు షాపులను కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించడం జరిగిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios